Begin typing your search above and press return to search.

కరోనాతో 3,159 కి చేసిన మృతుల సంఖ్య .. కీలక ప్రకటన చేసిన డబ్ల్యూహెచ్‌ఓ !

By:  Tupaki Desk   |   4 March 2020 9:45 AM GMT
కరోనాతో  3,159 కి చేసిన మృతుల సంఖ్య .. కీలక ప్రకటన చేసిన  డబ్ల్యూహెచ్‌ఓ !
X
కరోనా వైరస్‌ ...చైనాలో పుట్టినప్పటికీ ప్రస్తుతం 80 దేశాలకి విస్తరించి, ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అయితే , కరోనా బయటపడ్డ చైనాలో ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పడుతున్నా ప్రపంచంలోని మిగతా దేశాల్లో చాలా వేగంగా విస్తరిస్తోంది. హుబెయ్‌ ప్రావిన్సుల్లోని వుహాన్ నగరంలో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్.. వేలాది మందికి సోకింది. ఈ ప్రావిన్సుల్లోని దాదాపు 6 కోట్ల మంది జనాభా గత 45 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగా, మిగతా దేశాల్లో ముఖ్యంగా ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ వైరస్‌ వ్యాప్తికి నిర్దేశిత భూభాగం అంటూ లేదని, ఈ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

అలాగే, అమెరికాలోనూ మంగళవారం మరో ఇద్దరు చనిపోగా, మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,159 మంది మరణించగా... 92,000 కేసులు నమోదయినట్టు డబ్ల్యూహెచ్‌ ఓ వెల్లడించింది. మంగళవారం రాత్రి నాటికి న్యూ హంపషైర్, జార్జియా, ఉత్తర కరోలినా సహా 15 రాష్ట్రాలల్లో 100కిపైగా కేసులు నమోదయ్యాయి. జపాన్, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. బుధవారం కొత్తగా 516 కేసులు దక్షిణ కొరియాలో నమోదుకాగా, అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 5,328కి చేరింది. మొత్తం 28 మంది ఇప్పటి వరకు మృతిచెందారు. ఇదే సమయంలో చైనాలో మంగళవారం కేవలం 119 కేసులు నమోదయ్యాయి. మంగళవారం మరో 38 మంది చనిపోయినట్టు చైనా అధికారులు ప్రకటించారు.

ఇటలీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చిన పర్యాటకులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. చైనా తర్వాత ఈ రెండు దేశాల్లోనే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. స్పెయిన్‌లో కరోనా వైరస్ తొలి మరణం చోటుచేసుకుంది. అల్జీరియాలో మరో ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా, మొత్తం బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక ఈ వైరస్ ఇప్పుడిప్పుడే ఇండియా లో కూడా ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఢిల్లీ లో , తెలంగాణాలో ఈ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టకపోవడంతో , ఆ వైరస్ రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.