Begin typing your search above and press return to search.

డేంజర్​ బెల్స్​.. 301 జిల్లాల్లో కరోనా ఉధృతి..!

By:  Tupaki Desk   |   9 May 2021 11:30 PM GMT
డేంజర్​ బెల్స్​.. 301 జిల్లాల్లో కరోనా ఉధృతి..!
X
దేశంలో కరోనా తన ఉధృతిని కొనసాగిస్తున్నది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు మహమ్మారి పాకి పోయింది. ఇక ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. మొదటి వేవ్​ను అద్భుతంగా కట్టడి చేసిన ఇండియా.. రెండో వేవ్​ టైంలో చేతులెత్తేసిందని విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మెడికల్​ జర్నల్​ లాన్​సెట్​ సహా.. పలు పత్రికలు భారత్​ తీరును తప్పుపట్టాయి. ఇక మన దేశంలో సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్నది. ముందుగా ఢిల్లీ, మహారాష్ట్రకే పరిమితమైన కరోనా క్రమంగా అన్ని రాష్ట్రాలకు పాకింది. కరోనా సెకండ్​ వేవ్​ ఉన్న టైంలో ఎన్నికలు నిర్వహించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పలు రాష్ట్రాలకే తగిన మొత్తంలో వ్యాక్సినేషన్​ డోసులు పంపలేదు. దీంతో అక్కడ వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్​డౌన్​ విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో మాత్రం లాక్​డౌన్​ పెట్టలేదు. ప్రస్తుతం కఠిన ఆంక్షలు మాత్రం అమలువుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్​ కొరత వేధిస్తున్నది. ఆస్పత్రుల్లో బెడ్లు లేవు. చాలా మంది కరోనా రోగులు ఆస్పత్రుల్లో నేలమీద పడుకుంటున్నారు. దేశంలో ప్రస్తుతం దుర్భర పరిస్థితి నెలకొన్నది.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఏయే జిల్లాలో ఏ స్థాయిలో కరోనా ఉంది అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా దాదాపు 301 జిల్లాల్లో 20 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉన్నట్టు కేంద్రం ఆరోగ్యశాఖ పేర్కొన్నది.

దేశంలోని 40 శాతం జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది.

741 జిల్లాలకు గాను 301 జిల్లాల్లో 20 శాతం అంతకుమించి పాజిటివిటీ నమోదవుతున్నట్టు తెలిపింది.

వాటిలో 15 జిల్లాల్లో అయితే ఏకంగా 50 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు ఉందని పేర్కొంది. అరుణాచల్​ ప్రదేశ్​లోని చంగ్లాంగ్​ జిల్లాలో అత్యధికంగా 91.5 శాతం పాజిటివిటీ రేటు ఉందని కేంద్రం పేర్కొన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం కరోనా పాకిపోయింది. మహమ్మారి దాటికి పేద, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాలన్న డిమాండ్​ కూడా రోజురోజుకు ఊపందుకుంటున్నది.