Begin typing your search above and press return to search.

బాబు పిలుపు విన‌బ‌డింది.. అయినా న‌టించేశారు!!

By:  Tupaki Desk   |   12 Oct 2020 2:15 PM IST
బాబు పిలుపు విన‌బ‌డింది.. అయినా న‌టించేశారు!!
X
చిత్రాలు.. విచిత్రాలు ఎక్క‌డో జ‌రుగుతాయ‌ని అనుకుంటారు కానీ.. రాజ‌కీయాల్లో జ‌రిగే చిత్ర‌లు.. చోటు చేసుకునే విచిత్రాల ముందు.. మ‌రెన్న‌యినా.. బ‌లాదూర్ కావాల్సిందే. ఇలాంటి చిత్ర విచిత్ర‌మైన ఘ‌ట‌న ఒక‌టి.. ఏపీ టీడీపీలో చోటు చేసుంది. పార్టీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబుపై పార్టీ నేత‌ల‌కు ఎక్క‌డా లేని భ‌క్తి ప్ర‌ప‌త్తులు ఉన్నాయంటారు. బాబు చెప్పిందే వేదం.. గీసిందే గీత అనే టైపులో కామెంట్లు కుమ్మేస్తారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం? నేత‌లు చెబుతున్న దానికి క్షేత్ర‌స్థాయిలో అమ‌లు చేస్తున్న దానికి మ‌ధ్య పొంతన ఉందా? అంటే.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీలో ఎంత చిత్ర విచిత్ర‌మైన రాజ‌కీయాలు చోటు చేసుకున్నాయో.. అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నేల నాలుగు చెర‌గులా.. అన్న‌ట్టుగా రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి అనంతపురం వ‌ర‌కు బాబు ప‌ట్ల భ‌క్తి ప్ర‌ద‌ర్శించ‌డంలో పోటీ ప‌డే త‌మ్ముళ్లు.. క్షేత్ర‌స్థాయిలోకి వ‌చ్చే స‌రికి ఆయ‌న‌కు ఏమాత్రం విలువ ఇవ్వ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రీ ముఖ్యంగా ఈ విష‌యంలో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాబును లెక్క చేయ‌డం లేదు. డ్యామిట్ గ‌తాన్ని ఎందుకు త‌వ్వుతావ్‌! అంటారా? స‌రే! దాన్ని వ‌దిలేద్దాం. ఇప్పుడు.. ప్ర‌స్తుతం.. గురించే మాట్లాడుకుందాం.. ఇటీవ‌లే చంద్ర‌బాబు అనేక వ్యూహాల‌కు ప‌దును పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పార్ల‌మెంట‌రీ జిల్లాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. మ‌హిళా నేత‌లు అంటూ.. ఎవ‌రెవ‌రికో పార్టీలో ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. కానీ, చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు విని.. ఊ..కొట్టి.. మౌనం పాటించేశారు!

మ‌రి.. దీన్ని చిత్రం కాక ఏమ‌నాలి? ఏపీకి రాజ‌ధానిగా అమ‌రావ‌తినే ఉంచాల‌నేది చంద్ర‌బాబు డిమాండ్‌. కాదు.. రాష్ట్ర అభివృద్ధికి మూడు రాజ‌ధానులు ఉండాల‌నేది స‌ర్కారు నినాదం. మొత్తంగా ఉద్య‌మానికి శ్రీకారం చుట్టించిన చంద్ర‌బాబు.. ఇది 300ల రోజుకు చేరుకున్న నేప‌థ్యంలో మ‌రింత బూమ్ ఇవ్వాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ్ముళ్ల‌కు ఓ పిలుపు గ‌ట్టిగానే వినిపించారు. ``ఉద్య‌మం స్టార్ట‌యి.. 300 రోజులు. మ‌నం ప‌డుకుంటే కుద‌ర‌దు. రాష్ట్రం అంతా కూడా రాజ‌ధాని కోసం ఉంద‌ని చెప్పాలి. అంద‌రూ రోడ్ల మీద‌కు రండి.. ఉద్య‌మానికి సంఘీభావం చెప్పండి!`` అంటూ.. త‌మ్ముళ్ల‌కు పిలుపునిచ్చారు. దీంతో పార్టీ నేత‌ల‌తో రోడ్లు కిక్కిరిసి పోతాయ‌నుకున్నారో.. ఏమో.. పోలీసులు నిన్నంతా రోడ్ల మీద‌కి వ‌చ్చేశారు.

ఎక్క‌డిక‌క్క‌డ బారికేడ్లు పెట్టేశారు. కీల‌క నేత‌ల స‌మాచారం తెప్పించుకున్నారు. తీరా చూస్తే.. గుంటూరు, కృష్నా జిల్లాలు త‌ప్పించి ఎక్క‌డా త‌మ్ముళ్లు క‌నిపిస్తే.. ఒట్టు! ఎవ‌రికి వారు మాకెందుకులే అనుకున్నారో.. లేక‌.. అయిపోయిన పెళ్లి(మూడు రాజ‌ధానులకు స‌ర్కారు శ్రీకారం చుట్ట‌డం)కి బాజా ఎందుకు అనుకున్నారో.. ఎన్నికలు దూరం కదా, ఇపుడే ఈ జగన్ తో ఎందుకు అనుకున్నారో గా గానీ మిన్న‌కున్నారు. దీంతో బాబు ఇచ్చిన పిలుపు.. విఫ‌ల‌మైంది. అయితే, నాయ‌కులు విన‌లేదా... అంటే.. విన్నారు. ఊ.. కొట్టలేదా.. అంటే.. కొట్టారు.కానీ.. ఎంచ‌క్కా ఎగ్గొట్టారు కూడా!! దీంతో ఇప్పుడు ఏం చేయాలి? అనేది చంద్ర‌బాబే తేల్చుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.