Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే జీతాల్లో 30 శాతం కట్ .. అసెంబ్లీ లో బిల్లు పాస్ !

By:  Tupaki Desk   |   23 Sept 2020 5:00 PM IST
ఎమ్మెల్యే జీతాల్లో 30 శాతం కట్ .. అసెంబ్లీ లో బిల్లు పాస్ !
X
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దేశంలో రోజురోజుకి కరోనా విజృంభణ పెరుగుతుండటం , లాక్ డౌన్ వల్ల ఉపాధి, తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చినప్పటికీ అందరికి ఇంకా సమస్యలు తీరిపోయాయా అంటే లేదనే చెప్పాలి. ముఖ్యంగా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయినవారు , ఇప్పుడు సరైన ఉపాధి వేటలో పడ్డారు. దీనితో ప్రభుత్వాలు కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలకి వీలైనంత మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నాయి.

ఇదిలా ఉంటే , కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యం లో శాసనసభ్యుల జీతభత్యాల్లో 30 శాతం తగ్గిస్తూ కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేల జీత, భత్యాలను 30 శాతం తగ్గించుకోవడం వల్ల 18 కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చని కర్ణాటక శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ల జీతభత్యాల నుంచి 30 శాతం కోత విధించేలా బిల్లు తీసుకువచ్చామని మంత్రి తెలియజేసారు.

వైరస్ పై పోరాటానికి నిధులను సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోతను విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే , రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మరోవైపు… ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.