Begin typing your search above and press return to search.

దేశంలో కొత్తగా 30వేల కరోనా పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   20 July 2021 5:44 AM GMT
దేశంలో కొత్తగా 30వేల కరోనా పాజిటివ్ కేసులు
X
భారతదేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే , సెకండ్ వేవ్ జోరు తగ్గుతుంది కదా అని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఊహించని నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దేశంలో ప్రజలు అయితే కరోనా లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తే, కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి. మరో వైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ఇందులో 3,03,53,710 మంది డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి ప్రభావంతో మొత్తం 4,14,482 మంది బాధితులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో వైపు టీకా డ్రైవ్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 41,18,46,401 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.15 శాతంగా ఉంది. నిన్న 33.77 లక్షల మంది తొలి డోస్ వేయించుకోగా... 18.9 లక్షల మంది సెకండ్ డోస్ వేయించుకున్నారు. టెస్టుల పాజిటివిటీ రేటు 140 రోజుల్లో తొలిసారి చాలా తక్కువగా నమోదైంది. అది 29 రోజులుగా 3 శాతం కంటే తక్కువే ఉంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 71,152 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,628 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,41,724కి చేరింది. కొత్తగా 22 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,154కి చేరింది. కొత్తగా 2,744 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,05,000కి చేరింది. ప్రస్తుతం 23,570 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,36,64,207 టెస్టులు జరిగాయి. తెలంగాణలో కొత్తగా 746 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,37,373కి చేరాయి. కొత్తగా 729 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,23,773కి చేరింది. రికవరీ రేటు 97.86 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు మరణించారు. మొత్తం మరణాలు 3,764కి చేరాయి. మరణాల రేటు 0.59 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,836 యాక్టివ్ కేసులున్నాయి.

ప్రపంచదేశాల్లో కొత్తగా 4,04,138, పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19.16 కోట్లు దాటింది. కొత్తగా 6,353 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 41.12 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.30 కోట్లు ఉన్నాయి. ఇవి మెల్లగా పెరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా 19,016 కేసులు, 94 మరణాలు వచ్చాయి. బ్రెజిల్‌లో 15,271 కొత్త కేసులు, 494 మరణాలు సంభవించాయి. నిన్న రోజువారీ ఎక్కువ కేసులు బ్రిటన్ 39,950 లో రాగా, ఆ తర్వాత ఇండొనేసియా 34,257, ఇండియా, ఇరాన్, రష్యాలో వచ్చాయి. రోజువారీ మరణాలు నిన్న ఇండొనేసియా 1,338 లో ఎక్కువగా రాగా ఆ తర్వాత రష్యా 719, బ్రెజిల్, కొలంబియా 446, అర్జెంటినా 406 లో వచ్చాయి.

ఇంగ్లండ్‌ లో కరోనా కేసులు తగ్గి ఆంక్షలు సడలించిన వేళ మరో వైరస్‌ కలకలం స‌ృష్టిస్తోంది. ఇంగ్లండ్‌ లో ఐదు వారాల్లో 154 మంది నోరోవైరస్‌ బారిన పడ్డట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేగంగా వ్యాపించే గుణం ఉన్న ఈ వైరస్‌ సోకితే అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు. ముఖ్యంగా కడుపుపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో దీన్ని వాంతిని కలిగించే సూక్ష్మజీవిగా నిపుణులు భావిస్తున్నారు. వైరస్‌ సోకిన వారి నుంచి కూడా వ్యాపిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు రెండు, మూడు రోజులు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.