Begin typing your search above and press return to search.

కశ్మీర్‌ లో భారీ ఎన్‌ కౌంటర్ .. అల్‌ఖైదా చీఫ్ హతం!

By:  Tupaki Desk   |   30 April 2020 12:30 PM IST
కశ్మీర్‌ లో భారీ ఎన్‌ కౌంటర్ .. అల్‌ఖైదా చీఫ్ హతం!
X
కశ్మీర్ ‌లో ఉగ్రవాదుల ఎరివేత ప్రక్రియను సైన్యం ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి పెద్ద సంఖ్యలో ముష్కరులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ మరింత అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా ఉగ్రకదలికలపై నిఘా పెట్టి - ముష్కరుల ఏరివేతకు ఆపరేషన్లు చేపట్టింది. తాజాగా, దక్షిణ కశ్మీర్‌ లోని సోఫియాన్‌ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు జరిగిన భారీ ఎన్ ‌కౌంటర్‌ లో కశ్మీర్ మాడ్యూల్ అల్‌ ఖైదా చీఫ్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అలాగే ఈ ఎదురు కాల్పుల్లో ఆర్మీ మేజర్ సహా ఆరుగురు సైనికులు - మరో ఇద్దరు పౌరులు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది అక్టోబరులో కశ్మీర్ మాడ్యూల్ అల్‌ ఖైదా చీఫ్ హమీద్ లోనేను శ్రీనగర్ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో సైన్యం మట్టుబెట్టింది. అతడి స్థానంలో అన్సార్ ఘాజావత్ ఉల్ హింద్ చీఫ్‌ గా బుర్హాన్ మాజీద్ కోకా బాధ్యతలు చేపట్టాడు. అయితే , తాజా ఎన్‌ కౌంటర్‌ లో మన సైన్యం కోకాను సైతం మట్టుబెట్టింది.

ఈ ఆపరేషన్‌ ను జమ్మూ కశ్మీర్ పోలీసులు - ఇండియన్ ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్‌ సంయుక్తంగా చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. బుధవారం సాయంత్రం తర్వాత అటువైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో ఉగ్రవాదులు హతమైనట్టు నిర్ధారించుకున్నామని తెలిపారు. ఘటనా స్థలిలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, వీరిని మాజీద్ కోకా - అనంత్‌ నాగ్ ‌కు చెందిన నసీర్ భట్ - కుల్గామ్‌ కు చెందిన ఉమర్ ఫియాదీన్ ‌గా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో అల్‌ ఖైదా కశ్మీర్ మాడ్యూల్‌ చీఫ్‌ లు ముగ్గుర్ని సైన్యం మట్టుబెట్టింది. కశ్మీర్ మాడ్యూల్ వ్యవస్థాపకుడు జకీర్ రషీద్ భట్ అలియాన్ జకీర్ మూసాను గతేడాది మే నెలలో - లోనేను అక్టోబరు లో, తాజాగా కోకాను హతమార్చారు.