Begin typing your search above and press return to search.

టాటాపై టెర్రరిస్టుల ప్రభావం

By:  Tupaki Desk   |   2 Dec 2015 3:41 PM IST
టాటాపై టెర్రరిస్టుల ప్రభావం
X
26/11 ముంబయి ఉగ్రవాద దాడి తన దృక్ఫథాన్ని మార్చేసిందని ప్రముఖ పారిశ్రామిక వేత్త టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా చెప్పారు. వడోదర మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రదానం చేసిన సాయాజీ రత్న అవార్డును అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. నా జీవితాన్ని ఒక సారి రివైండ్ చేసి చూసుకుంటే... ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ముంబై ఉగ్రదాడి సంఘటన నా జీవితాన్ని మార్చేసిందని టాటా అన్నారు.

ఆ దాడుల అనంతరం తాను ఒక ఆరు నెలల వరకూ సరిగా మాట్లాడలేకపోయానన్నారు. ఏదైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే మాట తడబడేదని చెప్పారు. ప్రతి సాయంత్రం తాను ఉగ్రదాడి బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు వెళ్లే వాడిని, వారిని, వారి కుటుంబాలను పరామర్శించే వాడినని రతన్ టాటా వివరించారు. ఈ సంఘటన తరువాతే తాను బాధితుల కోసం ట్రస్ట్ ను ప్రారంభించినట్లు వివరించారు. ఆ దాడి సంఘటన తనను ఎంతో కలచివేసిందని... తాను మరింత సున్నితంగా మారానని రతన్ టాటా చెప్పారు. పారిశ్రామిక రంగంలో ఉద్ధండుడిగా పేరున్న టాటా వంటి వ్యక్తే ముంబయి దాడుల కారణంగా మనిషి కాలేకపోతే పాపం.. ఆ దాడుల బాధిత కుటుంబాలు ఇంకెంత దెబ్బతిన్నాయో. అందుకే వారి కోసం ఆయన ట్రస్టు ప్రారంభించారు.