Begin typing your search above and press return to search.

కరోనా పురిటి గడ్డ లో మనోళ్లు అంతమంది ఉన్నారా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:13 AM GMT
కరోనా పురిటి గడ్డ లో మనోళ్లు అంతమంది ఉన్నారా?
X
ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు చైనాలో అంతకంతకూ వ్యాపిస్తోంది. దీన్ని నిలువరించే విషయంలో డ్రాగన్ దేశానికి ఒక పట్టాన పట్టు చిక్కని దుస్థితి నెలకొంది. వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ తో ఇప్పుడా దేశం కిందామీదా పడుతోంది. నిత్యం తక్కువలో తక్కువ 300 నుంచి 500 మంది వరకూ ఈ వైరస్ సోకుతున్నట్లుగా అంచనాలు వినిపిస్తున్నాయి.ఇప్పటివరకూ కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 56కు చేరుకోగా.. దాదాపు రెండు వేలకు పైగా కేసులు కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తొలుత సాధారణ జలుబు.. దగ్గు తో మొదలయ్యే ఈ వైరస్ నెమ్మది నెమ్మదిగా శరీరంలో చొచ్చుకుపోయి.. నిమోనియాగా మారి తన విశ్వరూపం చూపించి మనిషి శరీరాన్ని నిర్జీవంగా మార్చేస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. మరెన్ని ముందుస్తు చర్యలు తీసుకున్నప్పటికి చైనా లో షురూ అయిన ఈ వైరస్ ఇప్పుడు పలు దేశాల్ని చుట్టేసింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాతో పాటు జపాన్.. తైవాన్.. నేపాల్.. అమెరికా.. ఆస్ట్రేలియా.. ఫ్రాన్స్.. కెనడా.. వియత్నాం.. హాంగ్ కాంగ్.. మలేషియా.. సింగపూర్.. దక్షిణ కొరియా.. థాయ్ లాండ్ దేశాలకు వ్యాపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక.. చైనాలో ఉన్న తమ దేశీయుల్ని ఆయా దేశాలు తీసుకెళ్లి పోతున్నాయి. చైనా లో ఉన్న అమెరికన్ల ను అగ్ర రాజ్యం తమ దేశానికి తీసుకెళ్లిపోతోంది. ఫ్రాన్స్ సైతం ఇదే విధానాన్ని అమలు చేస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా వైరస్ కు పుట్టినిల్లు.. పురిటి గడ్డగా భావిస్తున్న వూహాన్ నగరంలో భారతదేశానికి చెందిన 250 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వారంతా విద్యార్థులే కావటం గమనార్హం. వీరందరిని ప్రత్యేకంగా భారత్ కు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ ఇప్పటివరకూ భారత్ లోకి అడుగు పెట్టినట్లుగా నిరూపితం కావటం లేదు. కాకుంటే.. హైదరాబాద్ కు చెందిన నలుగురు కరోనా వైరస్ అనుమానంతో ఫీవర్ ఆసుపత్రిలొ చేరిన నేపథ్యంలో నలుగురు సభ్యులతో కూడిన బృందం హైదరాబాద్ కు రాబోతోంది. కరోనా విషయం లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ జట్టు వివరించటం తో పాటు.. అవగాహన కలిగించనుంది.