Begin typing your search above and press return to search.

పాక్​ జైల్లో 25 ఏళ్లు నరకం..తెలియకచేసిన నేరానికి భారతీయుడికి శిక్ష

By:  Tupaki Desk   |   14 Nov 2020 2:21 PM IST
పాక్​ జైల్లో 25 ఏళ్లు నరకం..తెలియకచేసిన నేరానికి భారతీయుడికి శిక్ష
X
తెలియక చేసిన నేరం ఓ భారతీయుడు జీవితాన్ని దుర్భరం చేసింది. చట్టాల మీద అవగాహన లేని ఓ నిరక్షరాస్యుడు ఓ చిన్న పొరపాటు చేసి పాకిస్థాన్​ జైల్లో 25 ఏళ్లు శిక్ష అనుభవించాడు. తనవాళ్లకు దూరంగా ఇక సొంత ఊరుకు చేరుకుంటానన్న ఆశ కూడా సన్నగిల్లి నరకం అనుభవించాడు. తోటి ఖైదీల సూటిపోటి మాటలు బాధిస్తున్నా నిస్సహాయంగా ఉండిపోయాడు. చివరకు తన జైలు జీవితం పూర్తికావడంతో ఇటీవలే తన సొంతమనుషుల వద్దకు చేరుకున్నాడు. ఆ రోజు చేసిన చిన్నపొరపాటు తన జీవితాన్ని ఇలా తలకిందులు చేస్తుందని అతడు ఊహించలేకపోయడు. శుక్రవారం ఇంటికి చేరుకొని తనవాళ్లను కలుసుకున్నాడు.

ఒరిస్సా, సుందర్‌ఘర్‌ జిల్లాకు చెందిన బ్రిజు కుల్లు కూలి పని చేసేవాడు. 1995లో ఓ సారి పాకిస్థాన్​ సరిహద్దుల్లోకి వెళ్లాడు. ఆ సమయంలో అది తప్పు అని అతడికి తెలియదు. దీంతో అతడిని భారత గూఢచారిగా భావించిన పాక్​సైన్యం చిత్రహింసలు పెట్టింది. ఆ తర్వాత కేసు నమోదు చేసి జైల్లో శిక్ష విధించారు. 25 ఏళ్లకు పైగా లాహోర్‌ జైలులో మగ్గిపోయాడు. అతడి శిక్షాకాలం పూర్తవడంతో కొద్దిరోజుల క్రితం అతన్ని విడుదల చేశారు. భారత్‌ చేరుకున్న అతడు 14రోజుల పాటు అమృత్‌సర్‌లోని కరోనా క్వారంటైన్​ సెంటర్​లో ఉన్నాడు. శుక్రవారం సుందర్‌ఘర్‌ జిల్లా అధికారులు అతడ్ని సొంత ఊరు జంగతేలికి తీసుకువచ్చారు. పాతికేళ్ల తర్వాత సొంతూరికి చేరుకున్న అతడికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ‘ 25 ఏళ్ల తర్వాత స్వదేశానికి రావడం ఆనందంగా ఉంది. నేను తిరిగి ఇక్కడికి వస్తానని ఊహించలేదు.

పాక్​జైళ్లో నరకం అనుభవించాను. తోటిఖైదీలు కూడా నన్ను ఎంతో చులకనగా చూసేవారు. ఈ 25 ఏళ్లు ఎలా గడిచాయో ఊహించుకుంటేనే ఎంతో బాధగా ఉంది. నా ఊరి ప్రజలు నా కోసం స్వాగతం పలకడంతో నా బాధనంతా మరిచిపోయాను.’ అని బ్రిజు మీడియాతో అన్నాడు. పొరపాటున పాక్​బార్డర్​కు వెళ్లి అక్కడి జైళ్లలో మగ్గుతున్న అమాయకులు ఎందరో ఉన్నారు. వారి బాగోగులు చూసేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు బైటకు పంపిస్తే వాళ్లు ఆ నరక బాధలకు దూరం కావడమే కాకుండా తిరిగి కుటుంబం చెంతకు చేరొచ్చు.