Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ సర్కారు ఇళ్ల అండ

By:  Tupaki Desk   |   19 Nov 2015 4:22 AM GMT
ఏపీకి మోడీ సర్కారు ఇళ్ల అండ
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో కష్టాల్లో కూరుకుపోయిన ఏపీకి కేంద్రంలోని మోడీ సర్కారు పెద్దగా పట్టించుకున్నది లేదన్న విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతి కోసం కేంద్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. దసరా రోజున జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి రెండు చెంబుల్లో.. మట్టి.. నీళ్లు తీసుకొచ్చి ఏపీ ముఖ్యమంత్రి చేతికి ఇచ్చిన ప్రధాని మోడీ తన దారిన తాను పోవటం తెలిసిందే. విభజన సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేస్తామన్న మాట తప్పించి.. ఒక్కటంటే ఒక్క మాట చెప్పింది లేదు.

మోడీ సర్కారు తీరుపై సీమాంధ్రులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఏపీని ప్రత్యేక ధృష్టితో చూస్తామని.. విభజన కారణంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని చెప్పిన మాటలకు.. గడిచిన 18 నెలల్లో మోడీ సర్కారు అనుసరించిన తీరుకు సంబంధం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు.. ఏపీని ఆదుకునేందుకు అన్నివిధాలుగా కేంద్రం తోడ్పాటును అందిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అండ్ టీం చెబుతున్నారు. కానీ.. అవన్నీ కేవలం మాటలుగా మాత్రమే కనిపిస్తున్నాయే కానీ చేతల్లో లేదన్న విమర్శ ఉంది. దీనికి చెక్ చెబుతూ తాజాగా ఏపీకి కేంద్రసర్కారు భారీ వరాన్ని ఇచ్చింది. పట్టణ పేదల గృహాల పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంపిక చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో 2,28,204 ఇళ్లను నిర్మించనున్నారు.

ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. తమిళనాడు.. గుజరాత్.. రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇళ్లు నిర్మించటానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా కేటాయించిన ఇళ్లను చూస్తే.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ తో పాటు..మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా ఇళ్లను మంజూరు చేయటం విశేషం. మొత్తం 2,28,204 గృహాలకు ఏపీకి 1,93,147 ఇళ్లను కేటాయించింది. ఏపీలోని 37 పట్టణాల్లో ఈ ఇళ్లను నిర్మిస్తారు.

మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో గుజరాత్ కు 15,580 ఇళ్లు (నాలుగు పట్టణాల్లో).. తెలంగాణకు 10,290 ఇళ్లు (పది పట్టణాల్లో).. రాజస్థాన్ లో 6,255 ఇళ్లు (పది పట్టణాల్లో).. తమిళనాడులో 2,932 ఇళ్లు (ఐదు పట్టణాల్లో) నిర్మించాలని తాజాగా నిర్ణయించారు. మిగిలిన అంశాల్ని పక్కన పెడితే.. పేదలకు అందించే ఇళ్ల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి భారీ భరోసా దక్కిందని చెప్పొచ్చు. తాజా నిర్ణయం చూస్తే.. ఏపీకి ఏమీ చేయటం లేదన్న అపప్రద నుంచి బయట పడేందుకు ఏపీ మీద మోడీ సర్కారు ఫోకస్ చేస్తుందా? అన్న సందేహం కలగక మానదు.