Begin typing your search above and press return to search.

గాల్వాన్ ఘర్షణ వెనకున్న అసలు వివాదం ఏమిటి?

By:  Tupaki Desk   |   17 Jun 2020 5:00 AM GMT
గాల్వాన్ ఘర్షణ వెనకున్న అసలు వివాదం ఏమిటి?
X
గడిచిన నెలన్నర రోజులుగా లద్దాఖ్ పరిధిలోని సరిహద్దుల్లో భారత - చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అది కాస్తా ముదిరి.. తాజాగా ఘర్షణగా మారటమే కాదు.. మన దేశానికి చెందిన ఇరవై మంది సైనికులు అమరులు అయ్యారు. ఇంతకీ ఈ సమస్య ఏమిటి? రెండు దేశాల మధ్య వివాదం ఎప్పటి నుంచి ఉంది? ఎవరి వాదన ఏమిటి? ఇంతకాలం స్తబ్దుగా ఉన్న పరిస్థితి నుంచి.. ఇప్పటి పరిస్థితి కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.

భారత్.. చైనా మధ్య సుదీర్ఘ సరిహద్దు ఉంది. దగ్గర దగ్గర 3500 కి.మీ. పొడవున ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉంది. వాస్తవానికి ఇప్పుడు ఘర్షణ జరిగిన గాల్వాన్ వివాదం కారణంగానే 1962లోనూ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య వివాదం నెలకొని ఉంది. సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఒక్క తూటా కూడా పేల్లేదు. అలాంటిది ఒక్కసారిగా చైనా సైనికులు విరుచుకుపడ్డారెందుకు? అన్నది మరో ప్రశ్న.

నివురు గప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి నుంచి.. చైనా దుర్మార్గంతో మనోళ్లు 20 మంది అమరులయ్యేలా చేసింది. చైనాకు ఇంత కంటగింపు ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. మోడీ సర్కారు ఇటీవల చేపట్టిన చర్యలేనని పలువురు అభివర్ణిస్తున్నారు. కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనా భారీగా మౌలిక వసతులు.. సైనిక శిబిరాలు.. రైలు మార్గాల్ని నిర్మించుకుంటోంది.

ఇలాంటివి చూశాక సైతం.. తాము ఇలాంటివి వెంటనే ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన భారత్ కు రాలేదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సరిహద్దు ప్రాంతాలపై మోడీ సర్కారు మరింత ఫోకస్ పెట్టింది. డ్రాగన్ కు ధీటుగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల్ని నిర్మించుకోవటం షురూ చేసింది. ఇది కాస్తా చైనాకు కంటగింపుగా మారింది.

ఇటీవల పాంగాంగ్ సరస్సులోని ఫింగర్ ప్రాంతాల వద్ద కీలక రోడ్డును నిర్మిస్తోంది. గాల్వాన్ లోయలో దార్బుక్-ష్యోక్ దౌలత్ బేగ్ ఓల్డీలను అనుసంధానిస్తూ మరో రోడ్డును నిర్మిస్తోంది భారత సర్కారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చైనా వ్యాఖ్యల్ని భారత్ పట్టించుకోలేదు. తాను చేపట్టిన ప్రాజెక్టుల్ని ఆపకూడదని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ నెల మొదటి వారంలో పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పక్షాలకు చెందిన సైనిక.. దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి.

తొలుత లెఫ్టినెంట్ జనరల్ స్థాయితో చర్చలు జరగ్గా.. తర్వాత మేజర్ జనరల్ స్థాయిలో రెండు విడతల్లో చర్చలు జరిపారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావించారు. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ చోటు చేసుకుంది కూడా. ఇలాంటి సమయంలోనే చైనా దుర్మార్గానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.