Begin typing your search above and press return to search.

అవును..దేశంలో రోజుకు 2 లక్షల కేసులు నమోదు

By:  Tupaki Desk   |   13 Jan 2022 3:11 AM GMT
అవును..దేశంలో రోజుకు 2 లక్షల కేసులు నమోదు
X
మూడో వేవ్ ముంచుకొస్తోందన్న మాట స్థానే.. ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీనికి తగ్గట్లే.. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఆ విషయాన్ని చెప్పేస్తున్నాయి. కేవలం పదిరోజుల వ్యవధిలో నమోదు అవుతున్న కొవిడ్ కేసుల జోరు చూస్తే.. దేశంలో కరోనా ప్రభావం ఎంత ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా మారింది. బుధవారం నాటికి రోజుకు 1.94 లక్షలు (దగ్గర దగ్గర 2 లక్షలు) కేసులు నమోదు కావటం.. రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. గడిచిన ఏడునెలలో లేని విధంగా గరిష్ఠ కేసుల సంఖ్యకు దేశంలోని యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.

ఎప్పటిలానే దేశంలో అత్యధిక కేసుల నమోదు రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. బుధవారం ఒక్కరోజులోనే 46,723 కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తం కేసుల్లో దగ్గర దగ్గర 20 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలో నమోదైతే.. ఆ కేసుల్లో అత్యధికం ముంబయి మహానగరంలోనివే కావటం గమనార్హం. మొత్తం కేసుల్లో దాదాపు 40 శాతానికి పైగా కేసులు దేశ ఆర్థికరాజధానిగా పిలిచే ముంబయి మహానగరంలోనివే. మహారాష్ట్ర తర్వాత అత్యధికకేసులు నమోదైన రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. బుధవారం ఒక్క రోజులో వెల్లడైన కేసుల్లో చూస్తే.. ఈ రాష్ట్రంలో 27,561 కేసులు నమోదై.. రెండో స్థానంలో నిలిచింది.

మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 22,155 కేసులు నమోదుకాగా.. నాలుగో స్థానంలో కేరళ నిలిచింది. ఆ రాష్ట్రంలో రోజులో 12,742 కేసులు నమోదయ్యాయి. ఐదో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ఈ రాష్ట్రంలోరోజులో 9488కేసులు నమోదయ్యాయి. రోజులో అత్యధిక కేసులు నమోదైన నగరాల విషయానికి వస్తే.. తొలిస్థానం ముంబయి అయితే.. రెండో స్థానం బెంగళూరుగా చెబుతున్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తక్కువగా చెబుతున్నారు.

గడిచిన 24 గంటల్లో ఒమిక్రాన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 115 మంది మరణిస్తే.. భారత్ లో మాత్రం ఒక్క మరణమే సంభవించింది. రెండో వేవ్ ను చూస్తే.. రోజుకు 2 లక్షల కేసులు నమోదయ్యే వేళలో.. ఆసుపత్రుల వద్ద బారులు తీరటం.. అత్యవసర వైద్యం కోసం ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటే.. మూడో వేవ్ లో మాత్రం అలాంటివి లేకపోవటం కొంత ఉపశమనం కలిగించేదిగా చెప్పాలి. కేసులు భారీగా నమోదు అవుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువగా ఉండటంతో.. ఆసుపత్రుల్లో వైద్య సాయం కోసం వెళుతున్న వారు తక్కువగానే ఉంటున్నారు. దీంతో.. కేసుల నమోదు ఎక్కువ ఉన్నా.. దాని తీవ్రత పెద్దగా కనిపించటం లేదనే చెప్పాలి.