Begin typing your search above and press return to search.

కేరళలో వర్షబీభత్సం .. కొండ చరియలు విరిగిపడి 17 మంది మృతి

By:  Tupaki Desk   |   8 Aug 2020 11:30 AM IST
కేరళలో వర్షబీభత్సం .. కొండ చరియలు విరిగిపడి 17 మంది మృతి
X
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌ కు సమీపంలో రాజమలై ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో 17 మంది కన్నుమూశారు. మృతుల్లో పది మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన దాదాపు 80 మంది కార్మికులు గుడిసెలు ఏర్పాట్లు చేసుకుని నివాసముంటున్నారు. కొండ చరియలు విరిగిపడి 31 గుడిసెలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. 15 మంది మృతదేహాలు శిథిలాల కింద వెలికితీయగా...మరో 60 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం . కొండ చరియలు విరిగిపడ్డ ఘటనా స్థలాల్లో రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అలాగే , మరో 12 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. అయితే , పరిస్థితి ఘోరంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కేరళలో కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతిఘటనా స్థలి వద్ద నాలుగు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో రిస్క్యూ ఆపరేషన్ ‌కి కొంత అంతరాయం ఏర్పడుతుంది. ఎన్డీఆర్‌ ఎఫ్ దళాలు రిస్క్యూ ఆపరేషన్ ‌లో పాలుపంచుకుంటున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. త్రిశూర్ నుంచి మరో ఎన్డీఆర్ ఎఫ్ దళం ఘటనా స్థలికి వెళ్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది.