Begin typing your search above and press return to search.

సైన్యం కావాలనే కాల్చి చంపిందా ?

By:  Tupaki Desk   |   8 Dec 2021 8:34 AM GMT
సైన్యం కావాలనే కాల్చి చంపిందా ?
X
నాగాలాండ్ లోని సామాన్య పౌరులపై మిలిటరీ దళాలు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలంనంగా మారింది. నాగాలాండ్ రాజధాని కోహిమా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేసిన కార్మికులు కంపెనీ వాహనంలో తిరుగు ప్రయాణమైన సమయంలో సైన్యం సదరు వాహనాన్ని ఆపి కాల్పులు జరిపిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ ఘటనపై ఆ రాష్ట్రం డీజీపీ, పోలీసు కమిషనర్ ఇద్దరు విచారణ జరిపారు. ఈ విచారణలో సైన్యందే పూర్తిగా తప్పని తేలింది. ఆ నివేదికే ఇపుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఇంతకీ ఆ నివేదికలో ఏముందంటే కాల్పులు జరిపిన ప్రాంతంలో తీవ్రవాదుల కదలికలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టిచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం సైన్యం విస్తృతంగా గాలింపులు చేస్తోంది.

ఇందులో భాగంగానే కార్మికులు వస్తున్న వాహనాన్ని కూడా సైన్యం తనిఖీల కోసం ఆపింది. కార్మికులను విచారిస్తున్న సమయంలో సైన్యానికి అనుమనాస్పదంగా కనిపించిన ఒక వస్తువును తుపాకీగా అనుమానించింది సైన్యం. దాంతో అప్రమత్తమైన సైన్యం ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే కాల్పులకు దిగింది.

ఈ కాల్పుల్లో 7 మంది వ్యాన్లోనే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమపై సైన్యం ఎందుకు కాల్పులు జరుపుతోందో కూడా కార్మికులకు తెలీలేదు. తాము కాల్పులు జరిపిన తర్వాత ఎలాంటి ప్రతిఘటన రావటంలేదని అర్ధంకాగానే సైన్యం కాల్పులను నిలిపేసింది. వెంటనే తాము కాల్పులు జరిపింది సామాన్య జనాలపైనే అని అర్ధం చేసుకుంది. దాంతో మృతదేహాలను మాయం చేయటానికి ప్రయత్నించింది.

అప్పటికి కాల్పుల ఘటన నుండి తేరుకున్న మిగిలిన కార్మికులు సైన్యానికి వ్యతిరేకంగా గోల మొదలుపెట్టారు. అంతేకాకుండా కొందరు కార్మికులు సైన్యంపై దాడిచేశారు.

దాంతో సైన్యం రెండోసారి కాల్పులు జరిపారు. దాంతో రెండోసారి కాల్పుల్లో మరో 7 మంది చనిపోయారు. అంటే నివేదిక ప్రకారం మొదటిసారి కాల్పులు పొరబాటుగానే జరిగినా రెండోసారి కాల్పుల మాత్రం ఉద్దేశ్యపూర్వకమని స్పష్టంగా అర్ధమైపోతోంది.

చేసిన తప్పును సరిదిద్దుకునేందుకే రెండోసారి సైన్యం కాల్పులు జరిపిందని వీళ్ళ రిపోర్టులో తేలిపోయింది. మొదటిసారి కాల్పులు జరిపినపుడు వచ్చిన చప్పుళ్ళకు చుట్టుపక్కల జనాలు అలర్టయ్యారు. ఏమి జరిగిందో తెలుసుకునేందుకు వాహనం దగ్గరకు వచ్చిన తర్వాత సైన్యం రెండోసారి కాల్పులు జరపటాన్ని చాలామందే చూశారు.

డీజీపీ, కమీషనర్ ఇద్దరు కూడా తమ విచారణలో భాగంగా వ్యానులోని వారిని, స్ధానికులతో మాట్లాడి రిపోర్టు ఇచ్చారు. ఇదే విషయమై కోర్టు మార్షల్ కూడా మొదలైంది. కోర్టు మార్షల్లో డీపీజీ, కమీషనర్ రిపోర్టు కూడా కీలకంగా మారనుంది.