Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ముందే చేతులెత్తేసిందా?

By:  Tupaki Desk   |   6 Aug 2017 8:42 AM GMT
కాంగ్రెస్ ముందే చేతులెత్తేసిందా?
X
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడు విజయం సాధిస్తారని ముందునుంచి ఊహించిన విషయమే. పార్లమెంటులో బలాబలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు.. నిజానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మోహరించడమే సరైన నిర్ణయం కాదు. అయితే ఏదో భాజపాను ఇరుకున పెట్టాలని భావించినట్లుగా మహాత్మాగాంధీ మనుమడిని రంగంలోకి తేవడం, ఆ అంశాన్ని భాజపా ఖాతరు చేయకపోవడం జరిగింది. మొత్తానికి గత పాతికేళ్లలో ఏ ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ నమోదు కానంత భారీ మెజారిటీతో వెంకయ్యనాయుడు - గోపాలకృష్ణ గాంధీని ఓడించారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఓటింగ్ సరళిని పరిశీలించినప్పుడు మాత్రం.. ఓటింగ్ కు ముందే కాంగ్రెస్ పార్టీ వారికి తమ ఓటమి అర్థమైపోయిందా? అందుకే వారు ఈ ఎన్నికను నాన్ సీరియస్ గా తీసుకున్నారా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే.. సాధారణంగా మొత్తం ఓట్ల సంఖ్య పరిమితంగా ఉండే ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా చాలా విలువ ఉంటుంది. ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా వేయించుకోవడానికి అంతా తపన పడుతూ ఉంటారు. సాధారణంగా లక్షల్లో ఓట్లు ఉండే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల కంటె - వందలు- వేలల్లో ఓట్లు ఉండే పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి కూడా ఓటర్లు వచ్చి ఓటు వేసి వెళ్తుండడం అందుకే జరుగుతుంటుంది. ఆలెక్కన 800 కంటె ఎక్కువ మంది లేని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకంగానే పార్టీలు భావించాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసుకోవాలి.

గెలుపు తమకు గ్యారంటీ అనే అభిప్రాయం ఉన్నప్పటికీ.. ఎన్డీయే కూటమి పార్టీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని సీరియస్ గానే తీసుకున్నాయి. ప్రత్యేకించి.. ఎన్డీయే ఎన్నికకు ముందురోజు ప్రధాని మోడీ సారథ్యంలో తమ కూటమి వారందరికీ కలిపి మాక్ పోలింగ్ ను కూడా నిర్వహించి అవగాహన కల్పించింది. తీరా ఎన్నికల్లో ఓటింగ్ కు ఇద్దరు భాజపా ఎంపీలు మాత్రం గైర్హాజరయ్యారు. తెరాస ఎంపీ కేశవరావు ఆరోగ్యం సహకరించకున్నా సరే.. అతికష్టమ్మీద వచ్చి ఓటు వేశారు. ఒక్క ఓటు మిస్సయినంత మాత్రాన నష్టం లేకపోయినప్పటికీ.. తెలంగాణ తెలుగుదేశానికి చెందిన దేవేందర్ గౌడ్ ప్రత్యేక విమానంలో వచ్చి మరీ ఓటు వేశారు. అదే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఆ పార్టీ ఎంపీలు ఏకంగా 14 మంది ఓటింగ్ కు డుమ్మా కొట్టారు. దీన్ని గమనిస్తే.. ఎటూ తమకు ఓటమి తప్పదు.. పోలింగ్ కు వెళ్తే ఎంత.. వెళ్లకపోతే ఎంత అని కాంగ్రెసఓ నాయకులు ముందే ఫిక్సయినట్లుగా కనిపిస్తోంది. మరి పార్టీ పరువుపోయేలాగా ఏకంగా 14 మంది ఓటింగ్ కు గైర్హాజరవడంపై పార్టీ అధిష్టానం ఏం చర్య తీసుకుంటుందో చూడాలి.