Begin typing your search above and press return to search.

విద్యుత్ కోతల మీద విమర్శలు చేశారంతే.. దాడులతో 13 మందికి తీవ్రగాయాలు

By:  Tupaki Desk   |   9 April 2022 1:30 AM GMT
విద్యుత్ కోతల మీద విమర్శలు చేశారంతే.. దాడులతో 13 మందికి తీవ్రగాయాలు
X
అవును.. వాళ్లేం దోపిడీ చేయలేదు. దొంగతనం కూడా చేయలేదు. ఏ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించింది లేదు. వారు చేసిన పాపం ఏమైనా ఉందంటే.. ఇటీవల పెరిగిపోయిన కరెంటు కోతలపై విమర్శలు చేశారు. అది కూడా సోషల్ మీడియాలో. అంతే.. ఆ మాత్రం దానికే అలా విమర్శిస్తావా? అంటూ అర్థరాత్రి వేళ మారణాయుధాలు చేతబట్టి దాడులకు దిగటమే కాదు.. దొరికినోళ్లను దొరికినట్లుగా చితకబాదేసిన సంచలన ఉదంతం ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రస్తుతం సంచలనంగా మారిన ఈఉదంతం గురించి తెలిసిన వారంతా విస్తుపోతున్నారు. ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారు. కారణాల్ని పక్కన పెడితే.. ఏపీలో ప్రస్తుతం దారుణమైన విద్యుత్ సరఫరా సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు ప్రస్తుతం నడుస్తున్నది వేసవి కాలం కావటంతో కరెంటుకోతలకు తట్టుకోలేక ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. కరెంటు కోతల విషయంలో ప్రభుత్వ విధానాన్ని తప్పు పడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇదంతా కొత్తగా ఏర్పాటుచేసిన పల్నాడు జిల్లాలోని శావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామంలో పెద్ద ఎత్తున కరెంటుకోతలు అమలు అవుతున్న నేపథ్యంలో.. తాము ఎదుర్కొంటున్న సమస్యల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విద్యుత్ కోతల మీద విసుగుపుట్టి సోషల్ మీడియాలో వరుస పెట్టి పోస్టులు పెట్టేశారు. వారిలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన వైసీపీకి చెందిన కొందరు బుధవారం అర్థరాత్రి వేళలో పోస్టులు పెట్టిన వారి ఇళ్లపై దాడులకు తెగబడ్డారు.

ఈ దాడిలో దాదాపు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని మెరుగైన వైద్యం కోసం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు.

కంటికి కనిపిస్తూ.. పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్న కరెంటు కోతల మీద పోస్టులు పెడితే.. ఈ తీరులో దాడి చేస్తారా? అన్నదిప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. అభిమానం ఉండొచ్చు కానీ.. ప్రజలు ఇబ్బంది పడే సమస్యల మీద నోరు విప్పటం కూడా దారుణ తప్పు అనేలా దాడి చేయటం దేనికి నిదర్శనం?