Begin typing your search above and press return to search.

బాలిక‌పై అత్యాచారానికి స‌హ‌క‌రించిన అక్క‌!

By:  Tupaki Desk   |   21 July 2020 11:30 AM IST
బాలిక‌పై అత్యాచారానికి స‌హ‌క‌రించిన అక్క‌!
X
తీవ్ర సంచలనం రేపిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయ‌డంతో కొత్త కొత్త విష‌యాలు తెలుస్తున్నాయి. తాజాగా బాలికపై అఘాయిత్యం వెనుక ఆమెకు అక్క వరసయ్యే మచ్చా అనిత ప్రధాన కుట్రదారుగా వ్య‌వ‌హ‌రించాల‌ర‌ని రాజమండ్రి అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌ తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించిన వివ‌రాలు పోలీసులు వెల్ల‌డించారు.

కోరుకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అనిత రాజమండ్రిలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. తనకు చెల్లెలి వరుసయ్యే బాలిక (బాధితురాలు)కు మరో దుకాణంలో పని ఇప్పించింది. ఆ బాలికను జూన్ 22వ తేదీన వెంటబెట్టుకుని ఎయిర్‌పోర్టు రోడ్డుకు తీసుకెళ్లింది. అక్కడ ఐదుగురు యువకులు బాలికను ఆటోలో ఎక్కించుకుని రంపచోడవరం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్క‌డ ఆ బాలిక‌పై బ‌ల‌వంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంత‌రం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని అనిత సహా నిందితులు కూడా ఆ బాలిక‌ను బెదిరించారు. అక్క‌డి నుంచి బాలికను ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయారు.

దీన్ని ఆసరాగా తీసుకుని అనిత తనకు పరిచయమున్న మరికొంతమంది కుర్రాళ్లతో ఆమెను ఆటోలో కిడ్నాప్ చేసి మరోసారి సామూహిక అత్యాచారం చేయించింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై కొద్దిరోజులు బయటకు రాలేదు. ఈ నెల 12న అనిత బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించి ఆటోలో రాజమహేంద్రవరం క్వారీ ప్రాంతంలోని ఒక ఖాళీ పెంకుటింటికి తీసుకువెళ్లింది. అక్కడ మరి కొంతమంది యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 13వ తేదీ సాయంత్రం బాధితురాలిని అక్కడి నుంచి తరలించి గోకవరం బస్టాండు సమీపంలోని ఓ ఆసుపత్రి సమీపంలో ఉంటున్న లావణ్య అనే మహిళ ఇంట్లో బంధించారు. ఆ మూడు రోజుల త‌ర్వాత బాలిక క‌నిపించ‌కుండాపోయింది.

కంగారుప‌డిన బాలిక త‌ల్లి 15వ తేదీన కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు పెట్టార‌ని విషయం తెలుసుకున్న నిందితులు బాలికను ఇంటికి సమీపంలో వదిలిపెట్టారు. అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. తల్లి ఆస్పత్రిలో చేర్చ‌డంతో అక్క‌డ బాలిక‌పై అత్యాచారం జరిగినట్లు వైద్యులు చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. నిందితుల‌పై కిడ్నాప్, రేప్ కేసులతో పాటు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనిత, లావణ్యతో పాటు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఉన్నాడు. అత‌డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నిందితుల్లో నలుగురు ఆటో డ్రైవర్లతో మిగతా పనులు చేసుకుంటున్నవారు ఉన్నారు. ఓ మైనర్ బాలుడు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. నిందితులకు నిబంధ‌న‌ల ప్ర‌కారం వైద్య ప‌రీక్ష‌లు చేయ‌గా అందులో షాకింగ్ విష‌యం తెలిసింది. నిందితుల్లో ఇద్దరికి పాజిటివ్ రావడంతో అంతా షాకయ్యారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.