Begin typing your search above and press return to search.

ఒకే బైక్‌పై 107 చలాన్లు.. పెండింగ్ మొత్తం ఎంతంటే?

By:  Tupaki Desk   |   17 Nov 2021 12:30 AM GMT
ఒకే బైక్‌పై 107 చలాన్లు.. పెండింగ్ మొత్తం ఎంతంటే?
X
ట్రాఫిక్‌ రూల్స్‌ సరిగ్గా పాటించకపోతే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. అయితే వాటిని అవార్డులు అని అనుకున్నాడో ఏమోగానీ ఓ వ్యక్తి రూల్స్‌ పాటించకుండా 117 చలాన్లు పెండింగ్‌ లో ఉంచాడు. నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ వ్య‌క్తి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.నాలుగేళ్లుగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో 107 చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడు  ఎట్టకేలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌ లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ యాక్టివాను పోలీసులు నిలిపి పరిశీలించారు.

నాలుగేళ్లుగా 107 చలాన్లకు గాను మొత్తం రూ.35,835 పెండింగ్‌ లో ఉన్నట్లు తేలింది. దీనితో పోలీసులే షాక్ అయ్యారు. అబిడ్స్‌ సిటీ గూగుల్‌ భవనంలో స్కేటింగ్‌ కోచ్‌ గా పనిచేస్తున్న జునైద్ టీఎస్‌ 09ఎఫ్‌ 3792 నెంబర్ గల హోండా యాక్టివాను వెంటనే పోలీసులు సీజ్‌  చేశారు. నాలుగేళ్లుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో అతనిపై కేసు నమోదు చేశారు. వాహనాల‌పై చ‌లాన్లు ఉన్నాయా లేదా అని ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల‌ని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.  చ‌లాన్లు కట్ట‌కుంటే మోటార్ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు పెండింగ్ చలాన్లపై ప్రత్యేక దృష్టిసారించారు.  కూడళ్లలో వచ్చే పోయే ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు. అనుమానం ఉంటే వెంటనే ఆపి చలానాలు తనిఖీ చేస్తున్నారు. వీలైనంత వరకు అక్కడికక్కడే చలానా వసూలు చేస్తున్నారు. వేయి రూపాయల కంటే ఎక్కువ బాకీ ఉంటే వాహనదారులు ఖచ్చితంగా మీ-సేవలో కానీ, ఆన్ లైన్లో కానీ పేమెంట్ చేసినట్లుగా చూపిన తరువాతే వాహనం అప్పగిస్తున్నారు.

కొద్దిరోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు బైకులు, కార్లు, ఇతర వాహనదారులపై నిఘా పెట్టారు. సెల్‌ ఫోన్‌ లో మాట్లాడుతూ వెళ్లే వారి డ్రైవింగ్‌ ను, ఫోన్‌ లో మాట్లాడకుండా వెళ్తున్నవారి డ్రైవింగ్‌ను పరిశీలించారు. ప్రమాదాలకు కారణమవుతున్న కొన్ని అంశాలను గమనించారు. నగరంలోని 85 ప్రధాన కూడళ్ల వద్ద కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పరిశీలించారు. ద్విచక్రవాహనదారుల్లో 70 శాతం మంది ఫోన్‌ లో మాట్లాడుతున్నారని తెలుసుకున్నారు.ఈ ఉల్లంఘనులు ఎక్కువ ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, కోఠి, మలక్‌పేట, జూబ్లీహిల్స్‌, ఎస్సార్‌ నగర్‌, పంజాగుట్ట ట్రాఫిక్‌ ఠాణాల పరిధుల్లోనే కనిపిస్తున్నారని గుర్తించారు.వాహనం నడిపేప్పుడు ఫోన్‌ మోగగానే..బైక్‌, స్కూటీలపై వెళ్తున్నవారు వెనక, ముందూ ఆలోచించకుండా ఎత్తుతున్నారు. వాహనవేగం తగ్గి, వెనక వచ్చే వారు ఢీకొంటున్నారు. మరికొందరు ఒకచేత్తోనే వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు సరిగా వినిపించకపోవడంతో ఫోన్‌ దగ్గరగా పట్టుకొనే ప్రయత్నంలో యాక్సిలేటర్‌ గట్టిగా లాగుతున్నారు. ముందు వాహనాలను ఢీకొంటున్నారు.