Begin typing your search above and press return to search.

నాలుగో త‌ర‌గ‌తి పాసైన 105 ఏళ్ల బామ్మ‌!

By:  Tupaki Desk   |   8 Feb 2020 9:00 AM IST
నాలుగో త‌ర‌గ‌తి పాసైన 105 ఏళ్ల బామ్మ‌!
X
కృషి ఉంటే మ‌నుషులు ఋషుల‌వుతారు.....మ‌హా పురుషుల‌వుతారు....అన్నాడో సినీక‌వి. అకుంఠిత దీక్ష‌, ప‌ట్టుద‌ల ఉంటే దేన్నైనా సాధించ‌వ‌చ్చ‌నే ఇప్ప‌టికే ప‌లువురు నిరూపించారు. తొమ్మిదేళ్ల‌కు డిగ్రీ ప‌ట్టా పుచ్చుకున్న పిల్ల‌ల నుంచి తొంభై ఏళ్ల వ‌య‌స్సులో స్కూబా డైవింగ్ చేసిన బామ్మ‌ల వ‌ర‌కు ఇటువంటి ఉదంతాలు కోకొల్లలు. తాజాగా కేర‌ళ‌కు చెందిన ఓ సెంచూరియ‌న్ బామ్మ 105 ఏళ్ల వ‌య‌స్సు లో నాలుగో త‌ర‌గ‌తి పాసై ఔరా అనిపించింది. త‌న మునిమ‌న‌వ‌రాళ్ల‌తో పోటీప‌డి మ‌రీ 74.5 శాతం మార్కుల‌తో పాసై అందరినీ ఆశ్చ‌ర్యం లో ముంచెత్తింది. కృష్ణా...రామా అనుకుంటూ కాలం వెళ్ల‌దీయ‌కుండా....లేటు వ‌య‌సు లో లేటెస్ట్ విద్యార్థిని గా మారింది.

కేరళలోని కోల్లామ్ జిల్లాకు చెందిన భాగీరథి అనే బామ్మ వ‌య‌స్సు 105 సంవత్సరాలు. బ్రిటిషువారి పాల‌న స‌మ‌యంలో పుట్టిన బామ్మ నాటి ప‌రిస్థితుల దృష్ట్యా చ‌దువుకోలేక‌పోయింది. కానీ, చ‌దువుకోవాల‌నే కోరిక‌, విద్య‌పై ఆస‌క్తి అలాగే ఉండ‌డం తో వ‌య‌సు సెంచ‌రీ కొట్టినా స‌రే చ‌దువుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అనుకున్న‌దే త‌డ‌వుగా నాలుగో తరగతి పరీక్షలు రాసి 74.5 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 275 మార్కులకు గాను 205 మార్కులను భాగీరథి సాధించింద‌ని కేరళ అక్షరాస్యత మిషన్ తెలిపింది. ఇక మ‌న సెంచూరియ‌న్ బామ్మ లెక్క‌ల్లో పక్కాగా పాసై 75కు 75 మార్కులు సాధించింది. తన ఆరోగ్యం సహకరిస్తే, ఐదో తరగతి కూడా చదువుతానని ఉత్సాహంగా చెబుతోన్న శ‌తాధిక వృద్ధురాలిపై కేరళ ప్రభుత్వ పెద్దలు, బంధుమిత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటోన్న బామ్మ ఉదంతం సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అయింది.