Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నికల్లో ఓటేసేందుకు 10 లక్షల మంది వెళుతున్నారా?

By:  Tupaki Desk   |   7 April 2019 5:32 AM GMT
ఏపీలో ఎన్నికల్లో ఓటేసేందుకు 10 లక్షల మంది వెళుతున్నారా?
X
హోరాహోరీగా ఎన్నికల ఫైట్ సాగుతున్నప్పుడు ఇలాంటి సీన్లే తెర మీదకు వస్తాయి. ఈ నెల 11న జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా.. అందునా హైదరాబాద్ కు చెందిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు పెద్ద ఎత్తున ఏపీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

ఏపీలో జరిగే ఎన్నికల్లో ఓటేసేందుకు వీలుగా ఇప్పటికే రైల్వే రిజర్వేషన్లు భారీగా చేసుకున్నారు. ఏప్రిల్ 9.. 10 తేదీల్లో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ఏ ట్రైన్ లో కూడా రిజర్వేషన్లు లేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో లెక్క బయటకు వచ్చింది. ఏపీలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈ నెల తొమ్మిది.. పదో తేదీల్లో తక్కువలో తక్కువ హైదరాబాద్ నుంచి 3వేల బస్సులు బయలుదేరనున్నట్లుగా చెబుతున్నారు.

ఏపీకి చెందిన వివిద ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పలువురు.. తాము పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లు హైదరాబాద్ లో ఉంటే.. వారిని ఊరికి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ తరహా బస్సులు పదో తేదీన హైదరాబాద్ నుంచి దాదాపు వెయ్యికి పైనే బస్సలు స్టార్ట్ కానున్నట్లు చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎవరికి వారు తమకున్న ఆసక్తి మేరకు.. ఏపీలోని కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. బంధువుల మాటతో హైదరాబాద్ నుంచి.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రాప్రాంత ఓటర్లు దాదాపు 10 లక్షల మంది వరకూ ఓటు వేసేందుకు వెళుతున్నట్లుగా చెబుతున్నారు. సంక్రాంతికి ఏ తీరులో అయితే.. ఏపీలోని తమ సొంతూళ్లకు వెళుతుంటారో.. ఇంచుమించు అదే స్థాయిలో తాజాగా ఓటేసేందుకు అంతే స్థాయిలో ప్రయాణమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరింత భారీగా హైదరాబాద్ నుంచి ఓటర్లు ఏపీకి వెళితే.. తెలంగాణలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల పోలింగ్ భారీగా తగ్గటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.