Begin typing your search above and press return to search.

అమెరికా వలస విధానాల కాఠిన్యానికి నిదర్శనమీ చిన్నారి స్టోరీ

అమెరికా వలస విధానాల కఠినత్వం మరో కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మెరుగైన జీవితం ఆశించి అమెరికా వెళ్లిన ఓ వెనిజులా దంపతుల నుంచి వారి రెండేళ్ల పసిబిడ్డను దూరం చేసింది అమెరికా ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   1 May 2025 2:30 PM
US Immigration Policies Tear Another Family Apart
X

అమెరికా వలస విధానాల కఠినత్వం మరో కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మెరుగైన జీవితం ఆశించి అమెరికా వెళ్లిన ఓ వెనిజులా దంపతుల నుంచి వారి రెండేళ్ల పసిబిడ్డను దూరం చేసింది అమెరికా ప్రభుత్వం. తల్లిని తిరిగి స్వదేశం వెనిజులాకు పంపగా, తండ్రిని ఎల్ సాల్వడోర్‌లోని జైలుకు తరలించారు. దీంతో రెండేళ్ల చిన్నారి అమెరికాలోనే అనాథగా ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉంది. తమ బిడ్డను తిరిగి తమ చెంతకు చేర్చాలని ఆ తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

వెనిజులాలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో వేలాది మంది ఆ దేశాన్ని విడిచిపెడుతున్నారు. ఇలాగే దేశం విడిచిన ఎస్పినోజా, బెర్నాల్ పెరూలో కలుసుకున్నారు. అక్కడ బెర్నాల్ ఫాస్ట్‌ఫుడ్ స్టాల్‌లో, ఎస్పినోజా బార్బర్ దుకాణంలో పనిచేస్తూ వివాహం చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 8న పెరూ రాజధాని లిమాలో వారికి మైకెలిస్ ఆంటోనెల్లా ఎస్పినోజా అనే కుమార్తె జన్మించింది.

పాపకు ఏడాది వయసున్నప్పుడు, అంటే 2024 మే నెలలో ఈ దంపతులు తమ బిడ్డతో కలిసి అమెరికాకు బయలుదేరారు. ఈక్వెడార్, కొలంబియా మీదుగా అత్యంత ప్రమాదకరమైన డేరియన్ గ్యాప్ అడవిని దాటుకుంటూ వారు అమెరికా సరిహద్దుకు చేరుకున్నారు. అమెరికాలో ప్రవేశించిన అనంతరం వారిని అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అమెరికా అధికారులు వారిని వేర్వేరుగా నిర్బంధించారు. 2024 మార్చి 30న తండ్రి ఎస్పినోజాను ఎల్ సాల్వడోర్‌కు పంపారు. ఆ తర్వాత ఏప్రిల్ 25న తల్లి బెర్నాల్‌ను వెనిజులాకు తిప్పి పంపే విమానంలో ఎక్కించారు. అయితే ఆ సమయంలో రెండేళ్ల చిన్నారి మైకెలిస్‌ను తల్లితో పాటు వెనిజులాకు పంపలేదు. ఇమ్మిగ్రేషన్ పత్రాల్లో చిన్నారి పేరు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో పాపను వేరు చేశారు.

చిన్నారి అమెరికాలోనే ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. దీనిపై వివరణ ఇస్తూ, చిన్నారి తల్లిదండ్రులు వెనిజులాకు చెందిన "ట్రెన్ డి అరగువా" అనే ముఠాలో సభ్యులనే అనుమానంతో వారిని దేశం నుంచి బహిష్కరించామని పేర్కొంది. చిన్నారి వారి వద్ద ఉంటే వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని, అందుకే అమెరికా సంరక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

అయితే, కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను ఖండించారు. ఎస్పినోజా సోదరి మాట్లాడుతూ తన సోదరుడు నేరస్తుడు కాదని, అనేక మంది యువకుల్లాగే ఉపాధి కోసమే దేశం విడిచి వెళ్ళాడని తెలిపారు. బెర్నాల్ తల్లి మాట్లాడుతూ సంరక్షణ పేరుతో తన మనవరాలిని అమెరికాలో రోజుకో కుటుంబం వద్ద మారుస్తున్నారని, తల్లిదండ్రులు కనబడక ఆ చిన్నారి రోదిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో తమ మనవరాలిని, చిన్నారి తల్లి బెర్నాల్ చెంతకు వెనిజులాకు పంపాలని వారు అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటన అమెరికా వలస విధానాలపై, ముఖ్యంగా కుటుంబాలను విడదీయడంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.