Begin typing your search above and press return to search.

హనీమూన్ హర్రర్ .. పర్యాటక భద్రతపై ఆందోళన

విదేశీ పర్యటనలు అనగానే మనసులో మెరిసేది అందమైన జ్ఞాపకాలు. కానీ కెనడాలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న నికితా, కరణ్ దంపతులకు స్విట్జర్లాండ్ హనీమూన్ మాత్రం జీవితాంతం మర్చిపోలేని గాయాలను మిగిల్చింది.

By:  Tupaki Desk   |   10 Sept 2025 9:54 AM IST
హనీమూన్ హర్రర్ ..  పర్యాటక భద్రతపై ఆందోళన
X

విదేశీ పర్యటనలు అనగానే మనసులో మెరిసేది అందమైన జ్ఞాపకాలు. కానీ కెనడాలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న నికితా, కరణ్ దంపతులకు స్విట్జర్లాండ్ హనీమూన్ మాత్రం జీవితాంతం మర్చిపోలేని గాయాలను మిగిల్చింది. హోటల్ సిబ్బందితో జరిగిన ఘర్షణలో నికితా తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన పర్యాటక భద్రత, వృత్తిపరమైన హోటల్ సేవల ప్రమాణాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

సాధారణ వివాదం నుంచి ఘర్షణకు

ఈ జంట సీహోటెల్ ష్వెర్ట్ హోటల్‌లో బస చేసినప్పుడు గదిలో ఎయిర్ కండిషనింగ్ లేకపోవడం, ఫ్యాన్ అందించడంలో తలెత్తిన వివాదం పెద్దదైందని చెబుతున్నారు. చిన్న అపార్థం నుంచి మొదలైన వాగ్వాదం చివరికి దాడికి తెగబడే దాకా మారడం పర్యాటకులను ఆశ్చర్యపరిచింది.

నికితా అనుభవం చెక్‌అవుట్ రోజున బ్రేక్‌ఫాస్ట్ హాలులో ఒక వృద్ధ సిబ్బంది అకస్మాత్తుగా దాడి చేసి, పళ్ళు విరగగొట్టాడని, దవడ శాశ్వతంగా దెబ్బతిన్నదని నికితా కన్నీటి స్వరంతో వెల్లడించింది. పర్యటనలో భాగంగా ఇటలీ వెళ్లాలని ఉన్నా, గాయాల కారణంగా మధ్యలోనే తిరిగి రావాల్సి వచ్చిందని ఆమె వాపోయింది.

హోటల్ నిర్వాహకుల వాదన ఇది

హోటల్ నిర్వాహకులు మాత్రం జంటపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారు దురుసుగా ప్రవర్తించారని, అనుమతి లేకుండా వీడియో రికార్డు చేశారని ఆరోపించించారు. తమ సిబ్బంది గాయపడ్డారని, రక్షించుకునే క్రమంలో గ్లాస్ వేయడం జరిగిందని వివరణ ఇచ్చింది.

ఈ సంఘటన రెండు వాదనల మధ్య నిజమేంటనేది కోర్టు లేదా దర్యాప్తు అధికారులు తేల్చాలి. అయితే ఒక పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన దేశంలో హోటల్ సిబ్బంది-అతిథుల మధ్య ఇలాంటి ఘర్షణలు జరగడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. పర్యాటకుల భద్రత కేవలం వారి వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, హోటల్ నిర్వహణ, స్థానిక అధికారుల కర్తవ్యమూ.

అంతర్జాతీయ పర్యాటకులు ఎదుర్కొన్న ఈ ఘటన, సాంస్కృతిక వివక్షత, భాషా అంతరాలు ఎంతటి ప్రతికూలతలకు దారితీయవచ్చో సూచిస్తోంది. ముఖ్యంగా వైవిధ్యభరితమైన అతిథులను ఆహ్వానించే పర్యాటక దేశాలు, సేవా రంగంలో మరింత వృత్తిపరమైన శిక్షణ, భద్రతా చర్యలు చేపట్టడం అత్యవసరం.

నికితా-కరణ్ సంఘటన ఒక దంపతుల వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు. ఇది పర్యాటక రంగాని ఒక హెచ్చరిక కూడా. అతిథి–ఆతిథ్య సంబంధం నమ్మకం, గౌరవం మీద నిలుస్తుంది. అది దెబ్బతింటే పర్యాటక కేంద్రం ప్రతిష్టే ప్రశ్నార్థకమవుతుంది. ఈ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకొని, భద్రతా ప్రమాణాలను బలపరచడం తప్పనిసరి.