అమెరికాలో భార్య.. కొడుకును చంపి సూసైడ్ చేసుకున్న టెకీ
సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవాల్సిందే. పోరాడి గెలవాలే కానీ.. వెన్నుచూపకూడదు. ఇటీవల కాలంలో కొన్ని కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న విషాదాలు షాకింగ్ గా ఉంటున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 5:19 AMసమస్యలు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవాల్సిందే. పోరాడి గెలవాలే కానీ.. వెన్నుచూపకూడదు. ఇటీవల కాలంలో కొన్ని కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న విషాదాలు షాకింగ్ గా ఉంటున్నాయి. అలాంటి ఉదంతమే ఒకటి అమెరికాలోని భారత కుటుంబంలో చోటు చేసుకుంది. కారణం ఏమన్నది బయటకురాలేదు కానీ ఒక భారత టెకీ వ్యాపారవేత్త అమెరికాలో తన కుటుంబ సభ్యుల్ని చంపేసి.. తాను సూసైడ్ చేసుకున్న షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. అయితే.. ఒక కొడుకు మాత్రం ఈ హింస నుంచి తప్పించుకున్నాడు. ఏప్రిల్ 24న జరిగిన ఈ దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.
వాషింగ్టన్ న్యూక్యాజిల్ లో ఈ దారుణ ఉదంతంలోకి వెళితే.. 57 ఏళ్ల హర్షవర్ధన్ ఎస్ కిక్కెరీ తన భార్య 44 ఏళ్ల శ్వేత పన్యం.. వారి 14 ఏళ్ల కొడుకును చంపేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో వారి మరో కొడుకు హర్షవర్ధన్ ఇంట్లో లేకపోవటంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన హర్షవర్ధన్ చాలా సంవత్సరాల క్రితమే అమెరికాకు వెళ్లారు.
టెకీగా మంచి పేరు ప్రఖ్యాతుల్ని సాధించిన ఆయన.. 2017లో భార్య శ్వేతతో కలిసి భారత్ కు తిరిగి వచ్చారు. మైసూర్ లో హోలో వరల్డ్ పేరుతో రోబోటిక్ కంపెనీని ప్రారంభించారు. ఆయన సతీమణి శ్వేత సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఈ కంపెనీ మంచి పాపులార్టీని సొంతం చేసుకుంది. అంతేకాదు.. సరిహద్దు భద్రత కోసం రోబోలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒక ఐడియాతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు.
అయితే.. కొవిడ్ కారణంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో కంపెనీని 2022లో మూసేసి అమెరికాకు వెళ్లిపోయారు. రోబోటిక్స్ లో నిపుణుడైన ఆయన గతంలో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ లోనూ పని చేశారు. ఇదిలాఉంటే..ఏ కారణం వల్లో కానీ.. భార్య.. ఒక కొడుకును చంపేసి.. తాను ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు. వారి పోటోల్ని ప్రైవసీ కారణంగా పోలీసులు బయటకు విడుదల చేయలేదు. ఈ ఉదంతం అమెరికాలోని భారత కమ్యూనిటీల్లో సంచలనంగా మారింది.