Begin typing your search above and press return to search.

అయ్యో గీతాంజలి.. రెండు రోజుల్లోనే తల్లీకూతురు!

గీతాంజలిని వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలతో బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఆమె మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   2 April 2024 6:54 AM GMT
అయ్యో గీతాంజలి.. రెండు రోజుల్లోనే తల్లీకూతురు!
X

అమెరికాలో మరో దారుణ విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన తెలుగు మహిళ కమతం గీతాంజలి (32) మృత్యువాత పడింది. అదే ప్రమాదంలో ఆమె ఆరేళ్ల కుమార్తె హానిక స్పాట్‌ లోనే చనిపోయిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ లోని ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి చెందిన కమతం నరేష్, గీతాంజలి ఇద్దరికీ వివాహమయ్యాక అమెరికా వెళ్లారు. అక్కడ ఇద్దరూ సాఫ్టువేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు భ్రమణ్, కుమార్తె హానిక ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆదివారం కుమార్తె జన్మదినం సందర్భంగా అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి వెళ్లారు. అక్కడ పూజలు జరిపించారు.

ఆదివారం తెల్లవారుజామున దేవాలయం నుంచి తిరిగొస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నరేష్, గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృత్యు ఒడికి చేరుకుంది. గీతాంజలికి తీవ్ర గాయాలయ్యాయి. నరేష్‌ తోపాటు కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గీతాంజలిని వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలతో బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఆమె మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈ ప్రమాద ఘటనలో గాయపడ్డ భర్త నరేష్, కుమారుడు బ్రమణ్‌ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు రోజుల వ్యవధిలోనే తల్లీ, కుమార్తె మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తల్లడిల్లుతున్నారు. వారి మృతదేహాలను స్వగ్రామం కొణకంచికి తీసుకొచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో వారి స్వగ్రామమైన కొనకంచిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.