Begin typing your search above and press return to search.

'వరుడు కావలెను' సంగీత్ కు చీఫ్ గెస్టుగా బుట్టబొమ్మ..!

By:  Tupaki Desk   |   22 Oct 2021 10:30 AM GMT
వరుడు కావలెను సంగీత్ కు చీఫ్ గెస్టుగా బుట్టబొమ్మ..!
X
యువ హీరో నాగశౌర్య - రీతూ వర్మ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ''వరుడు కావలెను''. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఫన్ - ఎమోషన్స్ కలబోసిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ శరవేగంగా చేస్తున్నారు.

ఇందులో భాగంగా గురువారం గ్రాండ్ గా 'వరుడు కావలెను' ట్రైలర్ లాంచింగ్‌ ఈవెంట్ ను నిర్వహించారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రైలర్ ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం అవుతోంది.

పెళ్లి కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో 'వరుడు కావలెను సంగీత్' పేరుతో మేకర్స్ ఓ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. రేపు ప్రారంభం కానున్న ఈ వెడ్డింగ్ హంగామాకు పూజా హెగ్డే చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పూజా హెగ్డే ఇంతకముందు 'అరవింద సమేత' 'అల వైకుంఠపురములో' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్ లో మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలోనూ పుజా నే హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. నిర్మాతలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా 'వరుడు కావలెను' సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కు బుట్టబొమ్మ హాజరవుతోందని అర్థం అవుతోంది.

'వరుడు కావలెను' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ మరియు పాటలకు విశేష స్పందన లభించింది. విశాల్ చంద్రశేఖర్ - ఎస్ ఎస్ థమన్ కలిసి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. వంశీ పచ్చిపులుసుల సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. గణేష్ రావూరి దీనికి మాటలు రాశారు.