Begin typing your search above and press return to search.

నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న 'కేజీఎఫ్‌' బ్యూటీ

By:  Tupaki Desk   |   29 May 2022 2:30 AM GMT
నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న కేజీఎఫ్‌ బ్యూటీ
X
`కేజీఎఫ్‌`.. రెండు పార్టులుగా విడుద‌లైన ఈ క‌న్నడ చిత్రం ఇండియ‌న్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు. విడుద‌లైన ప్ర‌తి భాష‌లోనూ వ‌సూళ్ళ వ‌ర్షాన్ని కురిపించి ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంతో య‌శ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అలాగే ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన శ్రీ‌నిధి శెట్టి.. త‌న అందచందాలతో, అభినయంతో కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయింది.

కేజీఎఫ్ తొలి భాగంలో ఈమెకు పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌క‌పోయినా.. సెకెండ్ ఫార్ట్ తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈమెకు అన్ని వైపుల నుంచీ ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమె మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంద‌ట‌. అంతేకాదు, పారితోషికం విష‌యంలో నిర్మాత‌ల‌కు చుక్క‌లు సైతం చూపిస్తోంద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్ గా మారింది.

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అన్న సామెత‌ను హీరోయిన్లు తూచ త‌ప్ప‌కుండా ఫాలో అవుతుంటారు. అయితే ఈ లిస్ట్ లో తాజాగా శ్రీ‌నిధి శెట్టి కూడా చేరింద‌ని అంటున్నారు. `కేజీఎఫ్‌` సినిమాతో త‌న‌కు వ‌చ్చిన క్రేజ్ ను ఆమె బాగా ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తుంద‌ట‌. అందులో భాగంగా శ్రీ‌నిధి త‌న రెమ్యున‌రేష‌న్ ను అమాంతం పెంచేసింద‌ట‌.

రీసెంట్ గా టాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత శ్రీ‌నిధి శెట్టిని సంప్రదించి త‌మ సినిమాలో న‌టించ‌మ‌ని అడ‌గ్గా.. ఆమె దాదాపుగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌ష్మిక‌, పూజా హెగ్డే, కీర్తి సురేష్‌, స‌మంత వంటి స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ లో ఆ స్థాయి పారితోషికాన్ని పుచ్చుకుంటున్నారు.

కానీ, తెలుగులో ఒక్క స్ట్రెయిట్ మూవీ కూడా చేయని శ్రీనిధి అంత రెమ్యునరేషన్ ను అడ‌గ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేప‌థ్యంలోనే ఆమెను హీరోయిన్ గా తీసుకోవ‌డానికి నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌స్తుతం టాక్ న‌డుస్తోంది.

కాగా, మొన్నీ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో `పేరు ప్రఖ్యాతులు కావాలా? డబ్బు కావాలా?` అన్న ప్ర‌శ్న‌కు.. శ్రీ‌నిధి త‌న‌కు మాత్రం డ‌బ్బే కావాల‌ని డేరింగ్ గా స‌మాధానం ఇచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ఆమెను కొంద‌రు విమ‌ర్శించినా.. మ‌రికొంద‌రు మాత్రం స‌పోర్ట్ గా నిలిచారు.