Begin typing your search above and press return to search.

అందుకే కొత్త నిర్మాత‌లు స‌ప్త‌గిరి వెంట‌ప‌డుతున్నారా?

By:  Tupaki Desk   |   19 Jan 2022 9:30 AM GMT
అందుకే కొత్త నిర్మాత‌లు స‌ప్త‌గిరి వెంట‌ప‌డుతున్నారా?
X
సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అయిన చిత్రం `పిల్లా నువ్వులేని జీవితం`. ఈ చిత్రం అద్భుత విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు న‌టుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి ఏ.ఎస్‌. ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ త‌రువాత దర్శ‌కుడిగా భారీ చిత్రాలు చేసే అవ‌కాశం వ‌చ్చింది కానీ అవేవీ ఆయ‌నకు ఆశించిన ఫ‌లితాల్ని అందించ‌లేక‌పోయాయి. దాంతో కొంత విరామం తీసుకున్న ఏ.ఎస్‌. ర‌వికుమార్ చౌద‌రి క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి తో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయారు.

`స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌` మూవీతో హీరోగా మారిన క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి హీరోగా ద‌ర్శకుడు ఏ.ఎస్‌. ర‌వికుమార్ చౌద‌రి ఓ మూవీ చేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని రిగ్వేద క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మాత ఏ.ఎస్‌. రిగ్వేద నిర్మించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ మూవీని ఫిబ్ర‌వ‌రిలో లాంఛ‌రంగా ప్రారంభించ‌నున్నారు.

వున్న‌ట్టుండి ఈ డైరెక్ట‌ర్ స‌స్త‌గిరితో సినిమా చేస్తుండ‌టానికి కార‌ణం ఏంట‌ని అంతా ఆరాతీస్తున్నారు. స‌ప్త‌గిరి చిత్రాల‌కు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ వ‌ర్క‌వుట్ అవుతుండ‌టం, త‌న‌తో సినిమాలు చేసిన నిర్మాత‌లు న‌ష్టాల‌ని చూడ‌కుండా లాభాల‌ని సొంతం చేసుకుండ‌టంతో చాలా మంది నిర్మాత‌లు స‌ప్త‌గిరితో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌.

త‌న‌తో సినిమా తీస్తే ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌క‌పోగా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలోనే పెట్టిన డ‌బ్బు మొత్తం తిరిగి వ‌స్తుండ‌టం, పైగా మార్జిన్ లాభాలు వుండ‌టంతో నూత‌న నిర్మాత‌లు స‌ప్త‌గిరి తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నార‌ట‌. స‌ప్త‌గిరి ఇటీవ‌ల‌`గూడుపుఠాణి` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. థీయేట‌ర్ల‌లో గ‌త ఏడాది విడుద‌లైన ఈ మూవీ నిర్మాత‌ల‌కు మార్జిన్ లాభాల్ని అందించిందట.