Begin typing your search above and press return to search.

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ జీవితంలోని ఆమె ఎవరో రివీల్ చేశారు

By:  Tupaki Desk   |   27 Jun 2022 4:05 AM GMT
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ జీవితంలోని ఆమె ఎవరో రివీల్ చేశారు
X
టీడీపీ అధినేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు చిరంజీవి.. నాగబాబు.. తెలుగుదేశం నేతల్ని తూర్పార పట్టటంలో తనకు తానే సాటి అన్నట్లుగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తన బలుపు మాటల్ని.. పెద్దోళ్లు పెద్ద మనసుతో భరించారని.. లేకుంటే తాను కనిపించని లోకాలకు వెళ్లిపోయి ఉండేవాడినంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతగా.. జగన్ కు అరవీర భయంకర ఫ్యాన్ గా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు.

సినిమాలు.. రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టేస్తే.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని బయటకు చెప్పేశారు. 2023లో రివీల్ చేస్తానన్న ఆయన.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయిపోయారు. తన జీవితంలో ఉన్న ‘ఆమె’ అంటూ వివరాల్ని షేర్ చేసుకున్నారు. ఆమె హైదరాబాద్ లో ఉంటారని.. ఆమె వరంగల్ నుంచి చెన్నై మైగ్రేట్ అయ్యారని.. అప్పటి నుంచి తనకు తెలుసని చెప్పారు. ఆమె గురించి పృథ్వీ మాటల్లోనే చదివితే ధర్మంగా ఉంటుంది. ఆయన ఏమన్నారంటే..

‘‘నేను సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పటి నుంచి డబ్బులు ఇచ్చేవారు. ఇరవై ఏళ్లుగా తన బిడ్డలతో సమానంగా ఆదరిస్తున్నారు. నేను బతికి ఉన్నానంటే కారణం ఆమే. కొవిడ్ టైంలో కూడా నా దగ్గరున్నారు. అప్పుడు ఎన్నో పుకార్లు వచ్చాయి. దీనంతటికీ 2023లో జవాబు ఇస్తా. త్వరలోనే ఆమె గురించి వెల్లడిస్తా’ అని పేర్కొన్నారు. దీనికి ఆర్కే కల్పించుకొని.. సందర్భం వచ్చింది కదా.. పేరు ఇప్పుడే చెప్పొచ్చుగా? అని అడిగిన నేపథ్యంలో పృథ్వీ స్పందిస్తూ.. ఆమె గురించిన వివరాల్ని బయటపెట్టేశారు. ‘ఆమె పేరు దాసరి పద్మ రేఖ. వరంగల్ నుంచి చెన్నైకి మైగ్రేట్ అయ్యారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి తెలుసు. సినిమా రంగంలో డ్యాన్సర్ గా పని చేశారు. తర్వాత హైదరాబాద్ కు వచ్చేశారు’ అని పేర్కొన్నారు.

దాసరి పద్మరేఖ గురించి మరిన్ని వివరాలు వెల్లడించిన పృథ్వీ.. ‘‘వాళ్ల తాతగారు నాకు బాగా తెలుసు. వాళ్లకు ఏ సమస్య వచ్చినా నేను వెళ్లాను. నాకు ఏ సమస్య వచ్చినా వారు సాయం చేస్తారు. లొకేషన్ కు భోజనం కూడా పంపుతారు. ప్రస్తుతం నా పక్కన ఉన్నది దాసరి పద్మరేఖనే. నా ఆలనా పాలనా ఆవిడే చూసుకుంటారు. ఈ సందర్భంగా ఇంట్లో బాగానే గొడవలు జరిగేవి. చాలా కేసులు పెట్టారు.

దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఫ్యామిలీ లైఫ్ కి దూరంగా ఉన్నాను. నా పిల్లల్ని బాగా చూశాను. వాళ్లు సెటిల్ అయ్యారు. నా భార్య విజయవాడలో ఉంటుంది. గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మా అబ్బాయి అర్థం చేసుకున్నాడు. నేనిప్పుడు సెపరేట్ గా ఉంటున్నాను’ అంటూ ఓపెన్ అయ్యారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఇండస్ట్రీలో ఉండి ఇంత ఓపెన్ గా మాట్లాడే వారిని ఈ థర్టీ ఇయర్స్ లో పృథ్వీ ఒక్కరే అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదని చెప్పక తప్పదు.