Begin typing your search above and press return to search.

ఏపీ సీఎంతో సమావేశానికి రాలేనని చెప్పిన బాలయ్య...!

By:  Tupaki Desk   |   6 Jun 2020 8:10 AM GMT
ఏపీ సీఎంతో సమావేశానికి రాలేనని చెప్పిన బాలయ్య...!
X
టాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. షూటింగ్‌ లు ప్రారంభించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.. థియేటర్లు రీ ఓపెన్‌.. తదితర విషయాల గురించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సినీ ప్రముఖులు చర్చలు జరపాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పలువురు సినీ ప్రముఖులు ఈ విషయాలపై చర్చలు జరిపారు. ఇండస్ట్రీ పెద్దల సమావేశాలపై స్పందించిన నందమూరి బాలకృష్ణ సమావేశాలకి తనని పిలవలేదని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వాళ్ళందరూ తలసాని శ్రీనివాస్ తో కలిసి భూములు పంచుకుంటున్నారేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇండస్ట్రీలోని పలువురు బాలయ్యకు మద్ధతు తెలపగా.. మరికొందరు ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ సమావేశాలకు అందర్నీ పిలవాల్సిన అవసరం లేదని.. బాలయ్య అవసరం అనుకుంటే ఖచ్చితంగా పిలుస్తామని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. టాలీవుడ్ నిర్మాతల మండలి చైర్మన్ సి. కళ్యాణ్ కూడా ఇప్పటికే త్వరలోనే ఏపీ గవర్నమెంట్ తో కూడా సమావేశం అవుతామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జూన్ 9వ తారీఖున ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇండస్ట్రీ ప్రముఖులు కలవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఈసారి ఇండస్ట్రీలోని మిగతా వారిని కూడా కలుపుకొని పోవాలని అనుకుంటున్నారట. నందమూరి బాలయ్యని కూడా ఈ మీటింగ్ కి ఇన్వైట్ చేశారట. అయితే బాలకృష్ణ ఈ సమావేశానికి రాలేనని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని సి కళ్యాణ్ తెలియజేస్తూ.. ఈనెల 10న బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఉన్నందున.. ఆయన కుటుంబ సభ్యులు ప్రముఖుల సమక్షంలో షష్ఠి పూర్తి జరుపుకోనున్నారు.. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి రాలేనని చెప్పినట్లు వెల్లడించారు.