Begin typing your search above and press return to search.

'బాలయ్య అల్లుడి ఓటమికి ప్రచారం చేశా.. కానీ ఆయన విష్ణుకు మద్దతిచ్చారు'

By:  Tupaki Desk   |   14 Oct 2021 8:36 AM GMT
బాలయ్య అల్లుడి ఓటమికి ప్రచారం చేశా.. కానీ ఆయన విష్ణుకు మద్దతిచ్చారు
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి నాలుగు రోజులవుతున్నా.. ఇంకా ఎలక్షన్స్ గురించి రచ్చ కొనసాగుతూనే ఉంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు అందరూ రాజీనామా చేయడం.. ప్రెస్ మీట్ పెట్టి మంచు మోహన్ బాబు మీద ఆరోపణలు చేయడం జరిగిపోయాయి. అలానే మంచు విష్ణు నిన్న బుధవారం 'మా' అధ్యకుడి హోదాలో పెన్షన్ ఫైల్ పై సంతకం చేయడం జరిగింది. అయితే రాజీనామాల మీద 'మా' అధ్యక్షుడు ఎలా స్పందిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు విష్ణు తన తండ్రి మోహన్ బాబు తో కలిసి నందమూరి బాలకృష్ణతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గురువారం ఉదయం విష్ణు - మోహన్ బాబు కలిసి బాలయ్య ఇంటికి వెళ్లారు. 'మా' ఎన్నికల్లో విజయం సాధించడంతో తమకు మద్దతుగా నిలిచిన బాలకృష్ణ కు కృతజ్ఞతలు తెలిపారు. ‘మా’ అభివృద్ధి మరియు శాశ్వత భవన నిర్మాణం వంటి అంశాలపై వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ''బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలిసినందుకు ఆనందంగా ఉంది. అన్నయ్య యన్ టి రామారావు గారే నన్ను ఇంటికి పంపించినట్లు ఉంది. గత ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేష్ ను ఓడించడానికి నేను ప్రచారం చేశాను. అక్కడ వైస్సార్సీపీ గెలిచింది. కానీ, ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడుతున్న విష్ణు 'మా' భవన నిర్మాణం చేపడతానని ప్రకటించగానే.. విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు. అది ఆయన సంస్కారం. ఫోన్ చేసి అడగ్గానే ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుకి ఓటు వేసి గెలిపించారు'' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. సినీ పెద్దలందరితో కలిసి ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. ''ఈ నెల 16న ‘మా’ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. దీని కోసం ఇండస్ట్రీలోని పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఇప్పటికే సత్యనారాయణ - కోట శ్రీనివాసరావు - బ్రహ్మానందం - పరుచూరి బ్రదర్స్ ను కలిశాను. ఇప్పుడు బాలయ్య ను కలిశాను. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి ని కూడా కలుస్తాను'' అని మంచు విష్ణు తెలిపారు. తన తండ్రిలాగే బాలయ్య కూడా తనకు మొదటి నుంచి ఎంతో సపోర్ట్ చేశారని.. ఆశీర్వాదం తీసుకోవడానికే ఈరోజు ఆయన ఇంటికి వచ్చానని.. పెద్దలందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తానని విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా మీద ఈసీ మీటింగ్ తర్వాత స్పందిస్తానని అన్నారు.