Begin typing your search above and press return to search.

లారెన్స్ చంద్ర‌ముఖి ఎవ‌రు?

By:  Tupaki Desk   |   29 Jun 2022 1:30 AM GMT
లారెన్స్ చంద్ర‌ముఖి ఎవ‌రు?
X
17 ఏళ్ల క్రితం తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `చంద్ర‌ముఖి`. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో వున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు సెకండ్ ఇన్నింగ్స్ గా నిలిచి తిరుగులేని ఇమేజ్ ని అందించింది. జ్యోతిక‌ని కొత్త కోణంలో ఆవిష్క‌రించి న‌టిగా మ‌రింత గుర్తింపుని తెచ్చిపెట్టింది. లేడీ సూప‌ర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నన‌య‌న‌తార సినీ ప్ర‌స్థానానికి కీల‌క మ‌లుపుగా నిలిచింది. పి. వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీని ప్ర‌తిష్టాత్మ‌క శివాజీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై హీరో ప్ర‌భు, ఆయ‌న సోద‌రుడు రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

తమిళంలో రూపొందిన ఈ మూవీ 2005 లో తమిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. అప్ప‌ట్లో 19 కోట్ల బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ 75 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ర‌జ‌నీ స‌త్తాని మ‌రో సారి బాక్సాఫీస్ కు చాటింది. మోహ‌న్ లాల్‌, సురేష్ గోపీ, శోభ‌న కాంబినేష‌న్ లో ఫాజిల్ కూపొందించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `మ‌ణిచిత్ర‌తాళ్` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు.

17 ఏళ్ల త‌రువాత ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ కు సీక్వెల్ గా `చంద్ర‌ముఖి 2`ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రాఘ‌వ లారెన్స్ హీరోగా ఈ సీక్వెల్ ని నిర్మిస్తున్నారు. పి. వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ మూవీని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. జూన్ 14న ఈ ప్రాజెక్ట్ ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ మూవీలో చంద్ర‌ముఖి ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌బోతున్నారు? .. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పాత్ర కోసం మేక‌ర్స్ ఎవ‌రిని సంప్ర‌దించారు అన్న‌ది ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ పాత్రకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చి ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ మూవీలో చంద్ర‌ముఖి పాత్ర కోసం సీనియ‌ర్ హీరోయిన్ త్రిష‌ని మేక‌ర్స్ సంప్ర‌దించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందు కోసం త్రిష‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ని లైకా వ‌ర్గాలు ఆఫ‌ర్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

రాశిఖ‌న్నా,ఆండ్రియా మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించ‌నున్నార‌ని, న‌య‌న‌తార దుర్గ‌గా ప్ర‌త్యేక అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తాజాగా వినిపిస్తోంది. వ‌డివేలు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీకి ఎం.ఎం. కీర‌వాణి సంగీతం, ఆర్ .డి. రాజ‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌బోతుండ‌గా ప‌ద్మ‌శ్రీ తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చేస్తున్నారు.