Begin typing your search above and press return to search.

ఓటీటీలో వెంకీమామ మరో మూవీ..?

By:  Tupaki Desk   |   16 Sep 2021 2:30 AM GMT
ఓటీటీలో వెంకీమామ మరో మూవీ..?
X
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'దృశ్యం 2' చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే మాతృక బాటలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేదా థియేట్రికల్ రిలీజ్ కు వెళ్తారా? అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

ఈ నేపథ్యంలో ''దృశ్యం 2'' విడుదల గురించి ఓ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటిటి విధానంలోనే రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారట. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుందని టాక్ నడుస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను ఓటీటీ విడుదల చేయాలని చూస్తున్నారని.. దీనికి తగినట్లు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టనుందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నారప్ప' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు 'దృశ్యం 2' చిత్రాన్ని డిజిటల్ వేదికలో స్ట్రీమింగ్ పెట్టాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సెమెంట్ త్వరలోనే జరగనుందని సమాచారం. కాగా, 'దృశ్యం 2' చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై డి. సురేష్‌ బాబు నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో వెంకటేష్ సరసన మీనా హీరోయిన్ గా నటించింది. 'దృశ్యం' సినిమాతో సక్సెస్ అందుకున్న వెంకీ.. ఈ సీక్వెల్ తో ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తాడో చూడాలి.