Begin typing your search above and press return to search.

తెలుగు తెరపైకి హీరోయిన్ గా మరో వారసురాలు ఎంట్రీ!

By:  Tupaki Desk   |   23 Sep 2021 9:33 AM GMT
తెలుగు తెరపైకి హీరోయిన్ గా మరో వారసురాలు ఎంట్రీ!
X
తెలుగు తెరపై నటవారసత్వం బలంగానే కొనసాగుతోంది. సినిమా నేపథ్యం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన వారు, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. ఎంతటి బలమైన సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ అది మొదటి సినిమా వరకు మాత్రమే పనికి వస్తుంది. రెండవ సినిమా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. వాళ్లు అంగీకరిస్తేనే మూడవ సినిమా థియేటర్లకు వస్తుంది. ఈ విషయం చాలా కాలంగా నిరూపితమవుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే నట వారసత్వాన్ని కలిగిన కుటుంబం నుంచి వర్ష విశ్వనాథ్ తెలుగు తెరకి పరిచయమవుతుతోంది.

ఈ అమ్మాయి సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురు. నిన్నటితరం కథానాయికగా వాణి విశ్వనాథ్ కి మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కథానాయికగా పదేళ్ల పాటు ఆమె తన జోరును కొనసాగించారు. ఈ కాలంలో ఆమె వరుసగా అనేక సినిమాల్లో నటించారు. ఆమెకి బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమాలు మాత్రం 'కొదమసింహం' .. 'ఘరానా మొగుడు' అనే చెప్పాలి. ఆ తరువాత సినిమాలకు దూరమైన ఆమె, 'జయ జానకి నాయక' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆమె కూతురైన వర్ష విశ్వనాథ్ ఇప్పుడు తెలుగులో ఒక సినిమా చేస్తోంది. కిట్టూ నల్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో, కథానాయకుడిగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ సాలూరి పరిచయమవుతున్నాడు. గాజుల వీరేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగు వైజాగ్ లో జరుగుతోంది. హీరో హీరోయిన్ల కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు కిట్టూ మాట్లాడుతూ .. "ఇది ఓ అందమైన ప్రేమకథ .. అనుబంధాల నేపథ్యంలో సాగే కథ. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ కథలో ఉంటాయి. హీరో హీరోయిన్లకు ఇది తొలి సినిమానే అయినా, ఎక్కడా తడబడకుండా చాలా బాగా చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోంది. ఈ సినిమా తరువాత ఇద్దరూ బిజీ కావడం ఖాయం. మణిశర్మ సంగీతం మా సినిమాకి ప్రధానమైన బలం. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాము" అని చెప్పుకొచ్చాడు.