Begin typing your search above and press return to search.

మరో షార్ట్ ఫిలిం డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ ఇస్తున్న యూవీ టీమ్..?

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:30 AM GMT
మరో షార్ట్ ఫిలిం డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ ఇస్తున్న యూవీ టీమ్..?
X
టాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవీ క్రియేష‌న్స్.. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు తీస్తూనే మరోవైపు చిన్న మీడియం బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు. మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్న యూవీ బృందం.. ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ ని పరిచయం చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. 'మిర్చి' తో కొరటాల శివ.. జిల్' సినిమాతో రాధాకృష్ణ కుమార్.. 'రన్ రాజా రన్' చిత్రంతో షార్ట్ ఫిలిం డైరెక్ట‌ర్ సుజీత్.. 'టాక్సీవాలా' తో రాహుల్ సాంకృత్యన్‌.. 'ఏక్ మినీ కథ' చిత్రంతో కార్తీక్ రాపోలు వంటి దర్శకులను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్రమంలో యూవీ క్రియేష‌న్స్ వారు మరో షార్ట్ ఫిలిం డైరెక్ట‌ర్ ని పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.

గతేడాది విడుదలైన ''మనసానమః'' అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాలాలకు అనుగుణంగా మారే పరిస్థితులని ఒక కుర్రాడు ప్రేమలో ఉన్నప్పుడు అనుభవించే భావోద్వేగాలకు ముడి పెడుతూ ఇప్పటితరం ప్రేమని.. ప్రేమకథలను చక్కగా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో చూపించి ఆకట్టుకున్నారు. పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ని దీపక్ అనే యువకుడు డైరెక్ట్ చేశాడు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ''మనసానమః'' లఘు చిత్రాన్ని తన సొంత బ్యానర్ లో తమిళంలో డబ్ చేసి విడుదల చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీపక్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ యూవీ టీమ్ ఓ సినిమా తీయనున్నారని టాక్ వినిపిస్తోంది.

'మనసానమః'' తోపాటుగా పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన దీపక్.. 'ఫిదా' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇటీవల దీపక్ చెప్పిన కథ నచ్చడంతో యూవీ క్రియేషన్స్ వారు ఈ యంగ్ డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న 'రాధే శ్యామ్' ఫైనల్ స్టేజీకి వచ్చేసింది. అలానే జీఏ2 పిక్చర్స్ తో కలిసి 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీటితోపాటు పలు ప్రాజెక్ట్స్ ఈ బ్యానర్ పై నిర్మాణ దశలో ఉన్నాయి.