Begin typing your search above and press return to search.

తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ స్టార్స్..!

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:30 AM GMT
తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ స్టార్స్..!
X
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లలో సినిమా పరిశ్రమ పని తీరు పూర్తిగా మారిపోయింది. సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు తెరపైకి వస్తుంది.. ఏ వేదిక మీద విడుదలవుతుంది అనే విషయాలపై క్లారిటీ లేకుండా పోయింది. అయినప్పటికీ టాలీవుడ్ స్టార్స్ ఇవేమీ పట్టించుకోకుండా.. తగ్గేదేలే అంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. స్టార్ హీరోలను మొదలుకొని కుర్ర హీరోల వరకూ అందరూ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే క్రమంలో నాలుగు చిత్రాలను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే 'భోళా శంకర్' 'గాడ్ ఫాదర్' వంటి సినిమాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఇదే క్రమంలో బాబీ (కేఎస్ రవీంద్ర) - వెంకీ కుడుముల సినిమాలను ప్రారంభించబోతున్నారు. డైరెక్టర్ మారుతీతో ఓ మూవీ కోసం చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 మూవీ చేయనున్నారు. అలానే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు కథ సిద్ధం అవుతోంది. ఇక కొరటాల శివ - అనిల్ రావిపూడి - వంశీ పైడిపల్లి వంటి దర్శకులు మహేష్ కోసం వేచి చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

'రాధేశ్యామ్' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 'ఆదిపురుష్‌' షూటింగ్ పూర్తవ్వగా.. 'సలార్' 'ప్రాజెక్ట్ K' చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. త్వరలో సందీప్ వంగా 'స్పిరిట్' మూవీ స్టార్ట్ కానుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ఓ మూవీ.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ లో మారుతీతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలానే కరణ్ జోహార్ - దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సినిమాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

'భీమ్లా నాయక్' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్.. 'హరి హర వీరమల్లు' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీని తర్వాత 'భవదీయుడు భగత్ సింగ్' మరియు సురేందర్ రెడ్డి సినిమాలలో పవన్ నటించనున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' 'ఆచార్య' వంటి రెండు సినిమాల్లో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో గౌతమ్ తిన్ననూరితో ఓ మల్టీలాంగ్వేజ్ మూవీ స్టార్ట్ చేస్తారు. సుకుమార్ - ప్రశాంత్ నీల్ లతో చెర్రీ సినిమాలు ఉంటాయి.

'ఆర్.ఆర్.ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. దీని తర్వాత తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ తో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఇదే క్రమంలో బుచ్చిబాబు - అట్లీ వంటి దర్శకులతో ఎన్టీఆర్ వర్క్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 'పుష్ప: ది రైజ్' సినిమాతో సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఇదే క్రమంలో బోయపాటి శ్రీను - అట్లీ - మురగదాస్ వంటి సస్టార్ డైరెక్టర్స్ తో బన్నీ సినిమాలు చేసే అవకాశం ఉంది.

మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి' చిత్రాన్ని ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితోపాటు 'ధమాకా' 'రావణాసుర' 'టైగర్ నాగేశ్వరరావు' వంటి మూడు క్రేజీ చిత్రాల్లో రవితేజ నటించనున్నారు. నేచురల్ స్టార్ నాని 'అంటే సుందరానికి' 'దసరా' వంటి రెండు సినిమాలు చేస్తున్నారు. 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో జోష్ లో ఉన్న యువసామ్రాట్ నాగచైతన్య.. ప్రస్తుతం 'థాంక్యూ' 'లాల్ సింగ్ చద్దా' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇదే క్రమంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ హారర్ వెబ్ సిరీస్ చేయనున్నారు.

'బంగార్రాజు' సినిమాతో సక్సెస్ అందుకున్న కింగ్ అక్కినేని నాగార్జున.. 'ఘోస్ట్' అనే యాక్షన్ మూవీ చేస్తున్నారు. అలానే ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి నాగ్ తో చర్చలు జరుపుతున్నారని టాక్. ఇక అఖండమైన విజయాన్ని సాధించిన నందమూరి బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇదే క్రమంలో అనిల్ రావిపూడితో ఓ మూవీ కమిట్ అయ్యారు. విక్టరీ వెంకటేష్ 'ఎఫ్ 3' సినిమాతో పాటుగా 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ అందరూ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.