Begin typing your search above and press return to search.

సీసీసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి చిరంజీవి శ్రీకారం..!

By:  Tupaki Desk   |   20 April 2021 4:30 PM GMT
సీసీసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి చిరంజీవి శ్రీకారం..!
X
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభన అందరిలో ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం తోపాటుగా మరణాలు కూడా సంభవిస్తుబడటంతో ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో గతేడాది వచ్చిన పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు మహమ్మారి బారిన పడటం.. సినిమాల షూటింగులు ఆగిపోవడమే కాకుండా.. సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ) ముందుకొచ్చింది. సినీ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అపోలో హాస్పిటల్ వారితో కలిసి కోవిడ్ వ్యాక్సిన్‌ ఇప్పించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు.

'తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని, సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ(CCC) తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 24/7 సౌజన్యంతో చేపడుతున్నాం' అని చిరంజీవి ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో 45 ఏళ్ళు దాటిన సినీ కార్మికులకు అపోలో వారితో కలిసి మనకోసం-కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా ఉచితంగా వాక్సినేషన్ కార్యక్రమం తలపెట్టిందని.. ఈ గురువారం నుంచి నెల రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుందని చిరంజీవి ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో తెలిపారు. 45 ఏళ్ళు పైబడిన సినీ కార్మికులు సినీ జర్నలిస్టులు దీని కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. సభ్యునితోపాటు తమ జీవిత భాగస్వామికి కూడా వ్యాక్సిన్‌ ఉచితమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న మూడు నెలల వరకు ఉచితంగా అపోలో డాక్టరల్ని సంప్రదించవచ్చని.. మందులు కూడా రాయితీతో పొందవచ్చని.. షెడ్యూల్‌ వారీగా అపోలో ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ పొందాలని ఆయన కోరారు. కరోనా నుంచి చిత్ర పరిశ్రమను కాపాడటానికి దయచేసి అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఈఈ సందర్భంగా చిరంజీవి పిలుపునిచ్చారు.