Begin typing your search above and press return to search.

నవంబర్ లోనే 'పుష్ప' రెండు భాగాలకు బీజం.. పార్ట్-1లో అదనంగా ఐటమ్ సాంగ్..!

By:  Tupaki Desk   |   12 May 2021 4:30 PM GMT
నవంబర్ లోనే పుష్ప రెండు భాగాలకు బీజం.. పార్ట్-1లో అదనంగా ఐటమ్ సాంగ్..!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించిన నిర్మాత రవిశంకర్.. 'పుష్ప' చిత్రాన్ని 2 భాగాలుగా చేస్తున్నామని వెల్లడించారు. 'గతేడాది నవంబర్ లోనే ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్ గా తీయాలని నిర్ణయించుకున్నాం. ఇది స్పాన్‌ ఉన్న సబ్జెక్ట్‌. రెండున్నర గంటల్లో చెప్పడం చాలా కష్టం. అందుకే అందరం కలసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. బడ్జెట్ కూడా దీనికి తగ్గట్టుగానే కేటాయించడం జరుగుతుంది' అని నిర్మాత చెప్పారు.

ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కి తగిన షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిందని.. ఒక సాంగ్ మరియు కొన్ని సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని రవిశంకర్ తెలిపారు. ''స్టోరీని 2 పార్ట్స్ గా చేసిన తర్వాత అదనంగా మరో సాంగ్ ని జత చేస్తున్నాం. అది కూడా ఓ ఐటమ్ సాంగ్. దాంట్లో ఏ హీరోయిన్ పెర్ఫార్మ చేస్తుందనేది ఇంకా డిసైడ్ చేయలేదు'' అని చెప్పారు. ఫస్ట్‌ పార్ట్‌ పూర్తి కాగానే రెండో పార్ట్ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తామని.. ఇప్పటికే సెకండ్ పార్ట్ కి సంబంధించి 10 శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ''పుష్ప మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. కరోనా కారణంగా ఫస్ట్ పార్ట్ ని రంపచోదవరం అడవుల్లో చిత్రీకరించాం. కానీ సెకండ్ పార్ట్ లో విజువల్ ట్రీట్ ఇవ్వడానికి వేరే ప్రదేశాలలో షూట్ చేయబోతున్నాము'' అని ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చారు.

కాగా, 'పుష్ప' సినిమాలో లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌ గా బన్నీ కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. తెలుగులో 'బాహుబలి' 'ఎన్టీఆర్ బయోపిక్' తర్వాత రెండు భాగాలుగా వచ్చే సినిమా 'పుష్ప' అని చెప్పవచ్చు.