Begin typing your search above and press return to search.

శుక్రవారం నుంచి కొత్త సినిమాల సందడి ప్రారంభం..!

By:  Tupaki Desk   |   28 July 2021 9:45 AM GMT
శుక్రవారం నుంచి కొత్త సినిమాల సందడి ప్రారంభం..!
X
కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతబడటంతో సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో సినీ ప్రేమికులు కొంతకాలం థియేటర్ ఎక్సపీరియన్స్ కి దూరం అయ్యారు. అదే సమయంలో ఇంటి వద్దే ఉన్న జనాలు వినోదం కోసం ఓటీటీలో వచ్చే సినిమాలను ఆస్వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సినిమా హాళ్లు తెరుస్తున్నారు. అలానే ఫిలిం మేకర్స్ తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకురాడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

టాలీవుడ్ లో ఈ వారం నుంచే కొత్త సినిమాల సందడి మొదలు కాబోతోంది. జూలై 30వ తారీఖున స‌త్య‌దేవ్ 'తిమ్మ‌రుసు' చిత్రంతో పాటుగా తేజ సజ్జ 'ఇష్క్‌' కూడా రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఇదే క్రమంలో ఆగస్టు ఫస్ట్ వీక్ లో 'SR కళ్యాణమండపం' - 'ముగ్గురు మొనగాళ్లు' సినిమాలు థియేట్రికల్ విడుదల అవుతున్నాయి. ముందుగా థియేటర్లలోకి వచ్చే సత్యదేవ్ - తేజ సినిమాలపైనే ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టంతా ఉంది. సినిమాలు చూడటానికి థియేటర్లకు జనాలు వస్తారా?, థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఎలాంటి సందడి క‌నిపించ‌బోతోంది? అనేది ఈ సినిమాలతో తేలిపోతుందని నిపుణులు అంటున్నారు.

వీటికి థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ ను బట్టి కొన్ని పెద్ద సినిమాలను ఆగస్టులో విడుదల చేయాలా వద్దా అనే నిర్ణయానికి రావాలని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ మరో సమస్య ఏమిటంటే.. తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరుస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీకే అవ‌కాశం ఉంది. అలానే ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా థియేటర్లలో వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు ఉన్నాయి. థియేటర్ల యాజమాన్యం టికెట్ రేట్లను ఇష్టానుసారంగా పెంచేస్తే ప్రజలపై భారం పడుతుందనే ఉద్దేశ్యంతో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో థియేటర్లు పూర్తిగా తెరుచుకున్నా.. ఏపీలో మాత్రం అన్నీ ఓపెన్ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి.

ఏపీలో మల్టీప్లెక్స్ లు - 'ఏ' సెంటర్స్ లలో థియేటర్లు తెరిచినా.. 'బీ' 'సీ' సెంటర్లలో సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అవడం అనుమానమే. అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా తెలంగాణలో పూర్తి స్థాయిలో విడుదలైనా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాక్షికంగా రిలీజ్ అవుతుంది. ఇలాంటి టైం లో ఫిలిం మేకర్స్ కాస్త ధైర్యం చేసే థియేటర్లలో తమ సినిమాలను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. కాకపోతే ఓవర్ సీస్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటూ ఉండటం ఈ సినిమాలకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో రిలీజ్ కి రెడీ అయిన 'తిమ్మరుసు' 'ఇష్క్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

కాగా, 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్‌ కొప్పిశెట్టి ''తిమ్మరుసు'' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'అసైన్‌మెంట్‌ వాలి' అనేది దీనికి ఉపశీర్షిక. ఇందులో 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో క్రిమినల్ లాయర్‌ రామచంద్ర గా సత్యదేవ్ కనిపించనున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్‌ ఎరబోలు కలసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై బజ్ క్రియట్ చేసాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు 'జాంబిరెడ్డి' హీరో తేజ సజ్జా కూడా 'ఇష్క్' సినిమా కోసం జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ఎస్‌.ఎస్‌. రాజు అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ రీమేక్ చిత్రాన్ని మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి నిర్మించారు. ఈ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాల్లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.