Begin typing your search above and press return to search.

'మిషన్ ఇంపాజిబుల్' కోసం జర్నలిస్టుగా మారిన స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   21 July 2021 11:30 AM GMT
మిషన్ ఇంపాజిబుల్ కోసం జర్నలిస్టుగా మారిన స్టార్ హీరోయిన్..!
X
'ఝుమ్మందినాధం' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన తాప్సీ పన్నూ.. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. అయితే తెలుగులో చివరగా 'గేమ్ ఓవర్' అనే హిందీ తమిళ బైలింగ్విల్ లో కనిపించిన తాప్సీ.. ''మిషన్ ఇంపాజిబుల్'' (Mishan Impossible) మూవీతో మళ్ళీ టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తోంది.

'ఏజెంట్ సాయి శ్రీనివాస్' ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా తెరకెక్కుతోంది. ఇది తిరుపతికి దగ్గరలోని ఓ గ్రామంలో జరిగే హంటింగ్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఇందులో స్వరూప్ ఓ డిటెక్టివ్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

సినిమా షూటింగ్ లో తాప్సీ కూడా జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ ఇటీవలే వెల్లడించారు. అయితే తాజాగా ఈ చిత్రంలో ఈ బ్యూటీ పోషిస్తున్న పాత్ర గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. 'మిషన్ ఇంపాజిబుల్' మూవీలో తాప్సీ ఓ స్వతంత్ర జర్నలిస్ట్ గా కనిపిస్తుందని టాక్ నడుస్తోంది. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి దీపక్ యారగర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'హసీన్ దిల్ రూబా' చిత్రం ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తో నడుస్తోంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిందీలో 'రష్మీ రాకెట్' 'లూప్ లాపేట' 'దొబారా' 'శభాష్ మిథు' వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలానే తమిళ్ లో 'జనగణమన' 'అనబెల్లె సుబ్రహ్మణ్యం' 'ఏలియన్' వంటి చిత్రాల్లో తాప్సీ కీలక పాత్రలు పోషిస్తోంది.

ఇకపోతే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో కలిసి తాప్సీ నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోన్న తాప్సీ.. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారుతోంది. ఈ మేరకు 'అవుట్‌ సైడర్స్ ఫిలింస్‌' అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఈ బ్యూటీ.. న్యూ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెబుతోంది.

ఈ నేపథ్యంలో హోమ్ బ్యానర్ లో జీ స్టూడియోస్ మరియు నిర్మాత ప్రంజల్ ఖంద్‌ దియాలతో కలిసి తాప్సీ ప్రధాన పాత్రలో 'బ్లర్‌' అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అజయ్‌ భల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది తాప్సీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే విడుదలైన 'బ్లర్‌' ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కల్గించింది. 2022లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.