Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో వివాదం సద్దుమణిగిందనే అనుకుంటున్నా

By:  Tupaki Desk   |   30 May 2020 4:06 PM GMT
ఇండస్ట్రీలో వివాదం సద్దుమణిగిందనే అనుకుంటున్నా
X
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత రెండు రోజులుగా నడుస్తున్న వివాదంపై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరొకసారి స్పందించారు. ఈ రోజు దర్శకరత్న దాసరి నారాయణ రావు వర్ధంతి సభకి హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ అనంతరం మీడియా ముఖంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ దాసరి నారాయణ రావు గతంలో చాలా సమావేశాలు తన ఇంట్లోనే నిర్వహించారని.. అప్పుడు ఏ విధమైన వివాదాలు కూడా చోటు చేసుకోలేదని.. దాసరి ఇంట్లో మీటింగ్ పెడితే లేని అభ్యంతరాలు ఇప్పుడు చిరంజీవి ఇంట్లో జరిగే సమావేశాలకు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని అన్నారు. సినీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని అనుకుంటే మెగాస్టార్‌ చిరంజీవనే కాకుండా ఎవ్వరితోనైనా కలిసి నడుస్తామని భరద్వాజ స్పష్టం చేశారు. చిరంజీవి ఇంట్లో సమావేశం ఆయన స్వలాభం కోసం పెట్టలేదని.. ఈ భేటీని పెద్ద వివాదంగా చేస్తున్నారని తప్పుపట్టారు.

అంతేకాకుండా మీడియా ముందు బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని.. ఆయన అనని మాటల్ని కూడా అన్నారని చూపిస్తున్నారని.. ఆయన వ్యక్తిగతంగా అన్న మాటలపై తాను స్పందించను కానీ.. చిరంజీవి బాలకృష్ణ ఇద్దరూ చాలా స్నేహంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరితో మాట్లాడామని.. సమస్య సద్దుమణిగిందనే అనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు బాలకృష్ణలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దాసరి నారాయణ రావు ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కరోనా క్రైసిస్ ఛారిటీలో స్కాం జరిగిందట కదా అని మీడియా అడిగిన ప్రశ్నకి వ్యగ్యంగా సమాధానం ఇచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. ''అవును పెద్ద స్కామ్ జరిగింది. మేమందరం కలిసి డబ్బులు పంచుకున్నాం. డబ్బులను సమానంగా నొక్కేయాడానికే నిన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఎక్కువ వాటా ఎవరికి రావాలనే దానిపై చర్చించాం అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. పంచుకున్నామని ఆరోపణలు చేయడానికైనా ఇంగిత జ్ఞానం ఉండాలి.. పొట్టకూటి కోసం కష్టపడే వారికి నిత్యావసర సరుకులు సమకూర్చాలనే ఉద్దేశంతో సీసీసీని ఏర్పాటు చేశామని తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు.

కాగా ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదంపై నిర్మాత ప్రసన్నకుమార్‌ మరోలా స్పందించారు. సినీ పెద్దల సమావేశంపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ప్రసన్నకుమార్‌ సమర్థించారు. బాలకృష్ణ అభిప్రాయమే తమందరిలోనూ ఉందని.. ఈ సమావేశం గురించి 'మా' అధ్యక్షుడు నరేష్ కి.. జనరల్ సెక్రటరీ జీవితాకి, ఫిలిమ్‌ ఛాంబర్‌, కౌన్సిల్‌ లోని సభ్యులెవరికీ తెలియదన్నారు. అంతేకాకుండా చిరంజీవి బాలకృష్ణ ఇద్దరూ తెలుగు సినీ ఇండస్ట్రీకి రెండు కళ్లని.. ఇండస్ట్రీ సమస్య అందరిదని చెప్పుకొచ్చారు.