Begin typing your search above and press return to search.

ఏదైనా పవన్ సినిమా తర్వాతే అంటున్న స్టార్ ప్రొడ్యూసర్...?

By:  Tupaki Desk   |   20 Jun 2020 5:31 AM GMT
ఏదైనా పవన్ సినిమా తర్వాతే అంటున్న స్టార్ ప్రొడ్యూసర్...?
X
కరోనా మహమ్మారి వలన సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే మల్టీప్లెక్సెస్, థియేటర్లు మూసి వేయడంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్, థియేటర్ల ఓనర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు నిబంధనలు సడలిస్తూ షూటింగులకు అనుమతిస్తున్నాయి. దీంతో కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆగిపోయిన షూటింగ్స్ మొదలు పెట్టడానికి రెడీ అయ్యారు. కాకపోతే మళ్లీ రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకోవడం ఎందుకని వేచి చూసే ధోరణిలో ఉన్నారట. ఇక థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సినిమాల విషయంలో ఒక డెసిషన్ తీసుకున్నాడట.

దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన 'వి' సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది. నాని - సుధీర్ బాబు హీరోలు గా నటించిన ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. అయితే కరోనా ప్రభావం వల్ల కుదరలేదు. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న మరో సినిమా 'వకీల్ సాబ్'. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' కొంతమేర షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. ఈ సినిమా కూడా అనుకున్న ప్రకారం షూటింగ్ జరిగితే మే నెలలో రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు హిందీలో రీమేక్ అవుతున్న 'జెర్సీ' సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా అన్ని సినిమాలు ఎక్కడికక్కడ లాక్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'వి' సినిమా ఓటీటీ లో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. దీంతో తన సినిమా విడుదల పై దిల్ రాజు క్లారటీ ఇచ్చాడట. థియేట‌ర్లు రీ ఓపెన్ అయి ఇండ‌స్ట్రీ మ‌ళ్లీ సాధ‌ర‌ణ పొజిష‌న్ కి వ‌చ్చాకే సినిమాలని రిలీజ్ చేస్తానని వెల్లడించారట. అంతేకాకుండా ముందుగా పవర్ స్టార్ మూవీ 'వ‌కీల్ సాబ్' రిలీజ‌య్యే వ‌ర‌కు ఏ సినిమాలు రిలీజ్ చెయ్య‌ను అని స్టేట్మెంట్ ఇచ్చేసాడట. దీంతో దిల్ రాజు రిలీజ్ మీద అధార‌ప‌డ్డ వేరే బ్యాన‌ర్లు.. మీడియం రేంజ్ సినిమాల నిర్మాత‌లు గుండెలు ప‌ట్టుకున్నారట. దిల్ రాజు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్న 'వ‌కీల్ సాబ్' ఇక్క‌డ జ‌నాల‌కు ఎక్క‌డం చాలా క‌ష్టమని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.

ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన హిట్ మూవీ 'పింక్' చిత్రానికి రీమేక్ గా రాబోతోంది. అయితే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఏమాత్రం కమెర్షియల్ ఎలెమెంట్స్ లేని 'పింక్' సినిమాని ఎందుకు రీమేక్ చేయాలని అనుకున్నాడు అనేది సగటు పవన్ అభిమానికి మొదటి నుండి ఎదురవుతున్న ప్రశ్న. అంతేకాకుండా దీనికి స్టార్ డైరెక్టర్స్ ని పక్కన పెట్టి వేణు శ్రీరామ్ చేతిలో రీఎంట్రీ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టాడు అనేది వారి మదిలో ఉన్న మరో ప్రశ్న. బాలీవుడ్ లో 'పింక్' విజయవంతం కావడమే కాకుండా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. లైంగిక దాడికి గురైన ముగ్గురు యువతులు న్యాయం కోసం పోరాటం చేయడం.. ఒక లాయర్ వారికి అండగా ఉంటూ ఎలా న్యాయం జరిగేలా చూసాడు అనేది ఈ సినిమా ఇతివృత్తం. సమాజంలో మహిళలపై నేడు జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఈ సినిమాలో ప్రస్తావించారు. ఈ పాయింట్ నచ్చే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఓకే చేసి ఉంటాడు. అంతేకాకుండా ఈ సినిమా తమిళ్ లో కొన్ని మార్పులతో అజిత్ తో రీమేక్ చేయబడి పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఇక్కడ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో వర్కౌట్ అవుతుందా లేదా అని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు.