Begin typing your search above and press return to search.

సోనూ సూద్ ఇంటికి మరోసారి ఐటీ అధికారులు

By:  Tupaki Desk   |   16 Sep 2021 10:30 AM GMT
సోనూ సూద్ ఇంటికి మరోసారి ఐటీ అధికారులు
X
కరోనా లాక్ డౌన్ వేళ ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్ పై రెండోరోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్థరాత్రి వరకూ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై దాడులు చేసిన ఆదాయపు పన్ను అధికారులు ఈ ఉదయం ముంబైలోని అతని ఇంటికి వచ్చారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూ సూద్ ఆస్తి ఒప్పందంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఐటీ అధికారులు నిన్న సోనూ సూద్ తో సంబంధం ఉన్న ఆరు ప్రదేశాలలో తనిఖీలు చేశారు. జుహులోని అతని ఇంటితోపాటు అతని స్వచ్ఛంద సంస్థ కార్యాలయంతో సహా అన్నింటిలో తనిఖీలు చేశారు..

"సోనూ సూద్ కంపెనీ, లక్నో ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ మధ్య ఇటీవలి ఒప్పందం పరిశీలనలో ఉంది. ఈ డీల్‌పై పన్ను ఎగవేత ఆరోపణలపై సర్వే చేశాం" అని వర్గాలు పేర్కొన్నాయి.

ప్రతిపక్ష రాజకీయ నాయకులు మాత్రం ఇది సోనూసూద్ పై దాడి అని.. మంచి చేస్తున్న సోదూసూద్ పై బీజేపీ కక్ష సాధింపు చర్యలు అని మండిపడ్డారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అతని దాతృత్వం మరిచిపోయారా? అని నిలదీశారు. "వలసదారులకు దేవుడు" అయిన సోనూసూద్ పై దాడులను సోషల్ మీడియాలో ట్యాగ్‌లతో వైరల్ చేస్తూ బీజేపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన.. నిస్సహాయంగా ఉన్న వందలాది మంది వలసదారులను తమ సొంత రాష్ట్రానికి తీసుకెళ్లడానికి సోను సూద్ బస్సులు, రైళ్లు మరియు విమానాలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో రెండవ వేవ్ సమయంలో అతను కోవిడ్ రోగులకు ఆక్సిజన్‌ను ఏర్పాటు చేశాడు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో నటుడు సోనూసూద్ ఇటీవల సమావేశం అయిన కొన్ని రోజుల తర్వాత ఈ దాడులు జరగడంతో ఇది రాజకీయ కక్షసాధింపుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అతను పాఠశాల విద్యార్థుల కోసం "దేశ్ కా మెంటర్స్" కార్యక్రమానికి ఢిల్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడంతో బీజేపీ ఓర్వలేక ఈ దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు..

తాను రాజకీయాల్లోకి రావడం లేదని.. కేవలం తన స్వచ్ఛంద సేవ చేస్తున్నానని.. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సోనూసూద్ చెప్పినా ఆయనపై దాడులు జరగడం గమనార్హం.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సోనూసూద్ సమావేశం రాజకీయ ప్రవేశం గురించి పుకార్లు పుట్టించింది. బహుశా వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిగా సోనూసూద్ ఉండవచ్చని అంటున్నారు. అయితే సోనూసూద్ పై ప్రచారాన్ని రాజకీయ కక్షసాధింపు అనడాన్ని బిజెపి ఖండించింది.