Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ మూవీలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్?

By:  Tupaki Desk   |   8 May 2021 11:30 AM GMT
త్రివిక్రమ్ మూవీలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్?
X
త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. మహేశ్ బాబు కథానాయకుడిగా ఈ సినిమా రూపొందనుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. దాదాపు ఆమెనే ఖాయం కావొచ్చని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ 'సిమ్రాన్' ను తీసుకోనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ తన సినిమాల్లోని కీలకమైన పాత్రల కోసం సీనియర్ హీరోయిన్లను తీసుకోవడమనేది చాలా కాలంగా వస్తోంది. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్ర కోసం 'స్నేహ' ను ఎంపిక చేసుకున్నారు. ఆ తరువాత 'అ ఆ' సినిమాలో 'నదియా'ను .. 'అజ్ఞాతవాసి' కోసం 'ఖుష్బూ'ను .. 'అరవింద సమేత'లో 'దేవయాని'ని .. 'అల వైకుంఠపురములో' .. 'టబూ'ను తీసుకున్నారు. నిజంగానే ఆయా పాత్రలు ఆ సినిమాకి బలంగా నిలిచాయి కూడా. ఆ సీనియర్ హీరోయిన్లకు అవి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఇక మహేశ్ బాబుతో రూపొందించనున్న సినిమా కోసం త్రివిక్రమ్ .. సిమ్రాన్ ను తీసుకోవాలనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఈ వార్తనే చక్కర్లు కొడుతోంది. నిన్నటితరం కథానాయికగా సిమ్రాన్ తెలుగు తెరను దున్నేసింది. ఆమె హైట్ .. ఫిజిక్ అప్పట్లో ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకున్నారు. అలాంటి సిమ్రాన్ రీ ఎంట్రీ తరువాత తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను తమిళ సినిమాలు ఉన్నాయి. త్రివిక్రమ్ .. సిమ్రాన్ ను సంప్రదించనున్నారనే వార్తే గనుక నిజమైతే, ఆమె నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకోవచ్చు.