Begin typing your search above and press return to search.

త‌న అనుమ‌తి లేకుండా త‌న సినిమా రీమేక్.. ద‌ర్శ‌కుడి పోరాటం!

By:  Tupaki Desk   |   24 Feb 2020 10:30 PM GMT
త‌న అనుమ‌తి లేకుండా త‌న సినిమా రీమేక్.. ద‌ర్శ‌కుడి పోరాటం!
X
బాలీవుడ్ లో మిస్ట‌ర్ ఇండియా 2 విష‌యంలో రాద్ధాంతం కొన‌సాగుతూ ఉంది. ఈ సినిమాను తీయ‌బోతున్న‌ట్టుగా అలీ అబ్బాస్ జాఫ‌ర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఇదొక వివాదంగా మారుతూ ఉంది. ఒరిజిన‌ల్ మిస్ట‌ర్ ఇండియా రూప‌క‌ర్త‌లు ఈ విష‌యంలో గుర్రుగా ఉన్నారు.

వీరిలో ముందు వ‌ర‌స‌లో ఉన్నాడు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌పూర్. 1987లో అనిల్ క‌పూర్ హీరోగా మిస్ట‌ర్ ఇండియా సినిమాను తీసింది ఆయ‌నే. అనిల్ క‌పూర్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ హిట్. ఆ సినిమా, పాట‌లు, డ్యాన్సులు.. అవ‌న్నీ క‌ల్ట్ హిట్ హిందీ జ‌నాల్లో. అలా ఆ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్లో, రీమేకో ఏదో కానీ మిస్ట‌ర్ ఇండియా 2 అంటూ ఒక సినిమాను అనౌన్స్ చేశారు. ఈ విష‌యంలో శేఖ‌ర్ క‌పూర్ ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు.

మిస్ట‌ర్ ఇండియా రీమేక్-సీక్వెల్ విష‌యంలో త‌న‌ను ఎవ‌రూ స్పందించ‌లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌ను లేకుండా ఆ సినిమాను తీస్తారేమో కానీ, మిస్ట‌ర్ ఇండియాలో అద్భుత విల‌నిజాన్ని పండించిన అమ్రిష్ పురి లేకుండా ఆ సినిమాను తీయ‌డం సాధ్య‌మా? అని ఆయ‌న నెటిజ‌న్లను ప్ర‌శ్నించారు. అలా మిస్ట‌ర్ ఇండియా కొన‌సాగింపును ఆయ‌న పూర్తిగా వ్య‌తిరేకించారు. అలాగే ఈ విష‌యం లో అనిల్ క‌పూర్ ను కూడా స్పందించిన‌ట్టుగా లేరు! అనిల్ క‌పూర్ త‌న‌య సోన‌మ్ ఈ విష‌యంలో స్పందించింది. త‌న తండ్రిని కూడా ఎవ‌రూ స్పందించ‌ లేద‌ని ఆమె చెప్పింది. ఇలా మిస్ట‌ర్ ఇండియా హీరో, మిస్ట‌ర్ ఇండియా డైరెక్ట‌ర్.. ఇద్ద‌రూ ఈ లేటెస్ట్ వెర్ష‌న్ కు వ్య‌తిరేకంగా స్పందిస్తున్న‌ట్టు గా అవుతోంది.

అంతే కాదు.. ఈ విష‌యం లో శేఖ‌ర్ క‌పూర్ మ‌రింత పోరాటానికి రెడీ అవుతున్నార‌ట‌. ఇలాంటి సీక్వెల్స్ విష‌యం లో ఒరిజిన‌ల్ రైట‌ర్ల అనుమ‌తి ఉండాల‌నే డిమాండ్ ను ఆయ‌న తెర మీద‌కు తెస్తున్నారు.