Begin typing your search above and press return to search.

పెళ్లి పనులు షురూ చేసిన హీరో

By:  Tupaki Desk   |   30 May 2023 4:45 PM GMT
పెళ్లి పనులు షురూ చేసిన హీరో
X
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన శర్వానంద్ పెళ్లిపీటులు ఎక్కబోతున్నాడు. నాలుగు నెలల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆయన, త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నాడు. పెళ్లి ముహూర్తం కూడా ఖరారు అయ్యింది. అందుకే ఆయన పెళ్లి పనులు కూడా ప్రారంభించడం మొదలుపెట్టారు.

ఆయన తన పెళ్లి పత్రికలను పంచడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ని ఇటీవల కలిసిన శర్వానంద్ తన పెళ్లి పత్రికను ఆయనకు అందజేశారు.

తన పెళ్లికి రావాలని స్వయంగా ఆహ్వానించడం విశేషం. ప్రగతిభవన్ లో ఎంపీని కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఈ ఫోటోలో శర్వా చాలా నవ్వుతూ కనిపించారు. ఆయన చాలా సన్నపడినట్లు తెలుస్తోంది. మరీ యంగ్ గా కనిపిస్తున్నాడు.

జూన్3న జైపూర్‌ లోని లీలా ప్యాలెస్‌ లో శర్వానంద్‌, రక్షితల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ వేడుక రాత్రి 11 నుండి ప్రారంభమవుతుంది. కాగా, ఈ ఏడాది జనవరిలో శర్వానంద్ నిశ్చితార్థం రక్షిత రెడ్డితో జరిగింది. చాలా గ్రాండ్ గా ఈ కార్యక్రమం నిర్వహించగా, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్, అదితి రావ్ హైదరీ, అఖిల్ అక్కినేని, సిద్ధార్థ్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం వీరి పెళ్లి ఆగిపోయినట్లు కూడా వార్తలు రాగా, వాటిని ఆయన టీమ్ ఖండించారు. కాగా, రెండు రోజుల క్రితం కూడా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, తనకు ఏమీ కాలేదని క్షేమంగా ఉన్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి మరీ ఎక్కువ రోజులు సమయం లేకపోవడంతో, ముఖ్యమైన వారికి ఆయనే స్వయంగా పెళ్లి పత్రికలు పంచుతుండటం విశేషం.

ఇదిలా ఉండగా, శర్వానంద్ ది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని సమాచారం. రక్షిత రెడ్డి అమెరికాకు చెందిన టెక్కీ. ఆమెది ఏపీలో ప్రముఖ పొలిటికల్ ఫ్యామిలీ. వధువు తండ్రి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాది కాగా.. తాత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పొలిటిషియన్ కావడం విశేషం.