Begin typing your search above and press return to search.

తెలుగు తెరపై తగ్గిన సీనియర్ కమెడియన్ల సందడి!

By:  Tupaki Desk   |   9 Dec 2021 12:30 AM GMT
తెలుగు తెరపై తగ్గిన సీనియర్ కమెడియన్ల సందడి!
X
ఒకప్పుడు తెలుగు తెరపై హాస్యనటీనటులకు కొదవ ఉండేది కాదు. ఎంతమంది ఉన్నప్పటికీ అందరికీ అవకాశాలు అందుతూ ఉండేవి .. ఎవరి గుర్తింపు వారికి దక్కుతూ ఉండేది. అంతమంది ఉండటం వల్లనే ఒక 'చిత్రం భళారే విచిత్రం' .. ఒక 'జంబలకిడి పంబ' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అప్పట్లో ఈ సినిమాలు సష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఈనాటికీ ఈ సినిమాలు నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలంటే కష్టమనే చెప్పాలి .. దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి.

ఎందుకంటే ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ను కలిగిన కమెడియన్లు ఇప్పుడు ఎక్కువ మంది లేరు. ఏ పాత్రను ఇచ్చినా తమదైన ముద్రను వేసిన ఏవీఎస్ .. ధర్మవరపు .. కొండవలస .. గుండు హనుమంతరావు .. మల్లికార్జున్ .. వేణు మాధవ్ వంటి కమెడియన్లు ఇప్పుడు లేరు. వాళ్లకి దగ్గరగా గానీ .. ప్రత్యమ్నాయంగా అనిపించేవారుగాని ఇప్పుడు లేరు.

ఇక మిగిలినవారు అనారోగ్య కారణాల వలన .. అవకాశాలు తగ్గడం వలన తెరపై తగ్గువగానే మెరుస్తున్నారు. ముఖ్యంగా అలాంటివారిలో బ్రహ్మానందం .. అలీ .. కృష్ణ భగవాన్ .. రఘుబాబు కనిపిస్తున్నారు.

బ్రహ్మానందానికి ఆ మధ్య బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన సినిమాలు తగ్గించుకున్నారు. తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తనకి ఇబ్బంది కలిగించని కొన్ని పాత్రలను మాత్రమే ఆయన అంగీకరిస్తున్నారు.

బ్రహ్మానందం టైమింగ్స్ కారణంగా విసిగిపోయిన కొంతమంది, అంతకుముందే ఆయనను పక్కన పెడుతూ వచ్చారనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆర్ధికంగా బాగా స్థిరపడిపోయిన బ్రహ్మానందం కూడా ఆ విషయాలను లైట్ తీసుకున్నారు. తన టైమింగ్స్ కి ఒప్పుకున్నవారికి ఓకే అనేస్తున్నారు. సారీ అని చెప్పేసినవారితో డబుల్ ఓకే అనేస్తున్నారు.

ఇక అలీకి కూడా ఇప్పుడు అవకాశాలు అంతగా లేవు. సాధ్యమైనంత సందడిని బుల్లితెరపైనే చేసేస్తున్నాడు. పవన్ తో విభేదాలు కూడా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో ఆయనకి అవకాశాలు లేకుండా చేశాయని చెప్పుకునేవారు లేకపోలేదు.

సైలెంట్ గా పంచ్ లు వేస్తూనే తెగ నవ్వించే కృష్ణభగవాన్ కూడా, అనారోగ్యం కారణంగానే సినిమాలకి దూరంగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కారణం తెలియదుగానీ రఘుబాబుకి కూడా ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. కమెడియన్ గా అవకాశాలు తగ్గడం వల్లనే సునీల్ కూడా రూట్ మార్చాడు. వెన్నెల కిషోర్ .. సప్తగిరి మినహా కామెడీపై తమదైన ముద్రవేసే కమెడియన్లు పెద్దగా లేకపోవడం హాస్యాభిమానులకు అసంతృప్తిని కలిగించే విషయమే.