Begin typing your search above and press return to search.

వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సీనియర్ యాక్టర్స్...!

By:  Tupaki Desk   |   23 May 2020 12:30 AM GMT
వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సీనియర్ యాక్టర్స్...!
X
ఇప్పుడు ఎక్కడ చూసిన వెబ్ సిరీస్ అనే మాటే వినిపిస్తుంది. ఆ సిరీస్ చూసావా..? ఈ సిరీస్ చూసావా..? అని తెగ చర్చించుకుంటునున్నారు. అందుకే వెబ్ సిరీస్ లు చేయడానికి చాలా మంది ప్లాన్ చేస్తున్నారు.. పెద్ద హీరోలు కూడా వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీస్ అందరూ ఒకే దగ్గర సరదాగా గడుపుతూ ఈ వెబ్ సిరీస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కూడా వీటి హవా ఇలానే కొనసాగే అవకాశముంది. భవిష్యత్ లో ఓటీటీలదే రాజ్యం కాబోతోందని భావించిన నటీనటులు దర్శక నిర్మాతలు వెబ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. హాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం వెబ్ కంటెంట్ తో నటించడానికి ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్, రాజ్ కుమార్ రావు, మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, కియారా అద్వానీ, రాధికా ఆప్టే, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్ లాంటి వారు వెబ్ సిరీసులలో నటిస్తున్నారు.

మన టాలీవుడ్ లో కూడా శ్రీకాంత్, సందీప్ కిషన్, నవదీప్, సత్య దేవ్, ప్రియదర్శి, మంచు లక్ష్మీ, హెబ్బా పటేల్ లాంటి వారు ఇప్పటికే వెబ్ సిరీస్ లలో దర్శనమిచ్చారు. ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ సమంత ప్రియమణి కూడా ఆ వైపుగా అడుగులు వేశారు. అయితే ఇప్పటి దాకా సౌత్ ఇండస్ట్రీలో యంగ్ యాక్టర్స్ మాత్రమే వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తుండగా ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ కూడా ఆ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా వెబ్ సిరీస్ లో నటించేస్తున్నాడు. తమిరా డైరెక్ట్ చేస్తున్న 'ది పెర్ఫెక్ట్ హస్బెండ్' అనే పేరుతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు కట్టప్ప. అయితే ఇప్పుడు మరో సీనియర్ హీరో కూడా వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టబోతున్నాడట. ఒకప్పటి హీరో.. సీనియర్ నటి రాధికా హస్బెండ్ అయిన శరత్ కుమార్ కూడా వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ మధ్య ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని శరత్ కుమార్ స్పష్టం చేసారు. ఇప్పటికే దానికి సంభందించిన చర్చలు జరిగాయని ఆ ప్రాజెక్ట్ పూర్తి విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.