Begin typing your search above and press return to search.

థియేటర్ల వద్ద అప్పుడే సందడి మొదలు పెట్టిన హీరో

By:  Tupaki Desk   |   29 July 2021 1:10 PM GMT
థియేటర్ల వద్ద అప్పుడే సందడి మొదలు పెట్టిన హీరో
X
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో టాలీవుడ్ హీరోలందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. వారికి ఇష్టమైన యాక్టివిటీస్ చేసుకుంటూ కాలం వెళ్ల దీశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వినోదాన్ని అందించేందుకు గాను కొత్త ఓటీటీలు వచ్చాయి. ఓటీటల్లో డిఫరెంట్ కంటెంట్ కూడా వచ్చి బాగా అట్రాక్ట్ చేసింది. ఇందుకు షూటింగ్స్ అన్నీ ఇళ్లలో లేదా ఇండోర్‌ లో చేయాల్సి వచ్చింది. వరుసగా ఓటీటీ కంటెంట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి లాక్ డౌన్ స్టార్‌గా నిలిచాడు యాక్టర్ సత్యదేవ్. ఆ సమయంలో విడుదలైన పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లో దాదాపుగా సత్యదేవ్‌ నటించాడు. అలా డిఫరెంట్ ప్లస్ యూనిక్ కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లు చేసి సత్యదేవ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా ఆయన నటించిన 'తిమ్మరుసు' చిత్రం ఈ నెల 30 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ బిజీలో యూనిట్ సభ్యులు, హీరో సత్యదేవ్ ఉన్నారు. ఇప్పటికే విడుదలైన 'తిమ్మరుసు' ట్రైలర్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండగా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ కాగా, ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలు టాకీసుల్లో విడుదల అవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సత్యదేవ్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్ వద్దకు చేరుకున్నాడు. 'మెమరీ ఇన్ మేకింగ్' అనే క్యాప్షన్ పెట్టి థియేటర్ వద్ద దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు సత్యదేవ్. ఆ ఫొటో చూసి సత్యదేవ్‌పై నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

సత్యదేవ్ ఎంచుకునే ప్రతీ సినిమా, సిరీస్ డిఫరెంట్ అండ్ యూనిక్‌గా ఉంటుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమా చూడటం కోసం తానూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు విలక్షణ నటుడు సత్యదేవ్. ఈ క్రమంలోనే 'తిమ్మరుసు'ను మీకు దగ్గర ఉన్న టాకీసులో తప్పక చూడండి అంటూ ప్రేక్షకులను కోరాడు సత్యదేవ్. 'తిమ్మరుసు'లో సత్యదేవ్‌కు జోడీగా తెలుగమ్మాయి ప్రియాంక జువాల్కర్ నటించగా, చిత్రానికి శరణ్ కొప్పీ శెట్టి డైరెక్టర్. 'తిమ్మరుసు' చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని ప్రేక్షకులను కోరారు.

తన సినిమా ప్రమోషన్‌ కోసం సహకరించిన ఇద్దరు హీరోలకు సత్యదేవ్ థాంక్స్ చెప్పారు. ఇక సత్యదేవ్ నెక్స్ట్ మూవీస్ అన్ని కూడా వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. తమిళ్ డైరెక్టర్ మోహనరాజా డైరెక్షన్‌లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న 'లూసిఫర్' రీమేక్‌లో సత్యదేవ్ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు సత్యదేవ్ మరిన్ని చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇతిహాసగాధయైన రామాయాణం ఆధారంగా తెరకెక్కుతోన్న 'రామసేతు'లోనూ సత్యదేవ్‌కు కీలక పాత్ర లభించింది. ఆ చిత్రంలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా నటించబోయే గుర్తుందా శీతాకాలం, గాడ్సే, స్కైలాబ్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

'గుర్తుందా శీతాకాలం' సినిమా రీమేక్ అయినప్పటికీ డిఫరెంట్‌గా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా, కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సుహాసిని కనిపించబోతుంది. మొత్తానికి సత్యదేవ్‌ చాలా బిజీగా ఉన్నా కూడా తన ప్రస్తుత సినిమా తిమ్మరుసు కోసం చాలా ఎక్కువగానే కష్టపడుతూ ప్రమోషన్‌ చేస్తున్నాడు. ఈ సమయంలో సినిమా లు పెద్దగా పోటీ లేకపోవడం వల్ల కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.