Begin typing your search above and press return to search.

SSMB28.. సర్వం సిద్ధమేనా..?

By:  Tupaki Desk   |   6 July 2022 5:47 AM GMT
SSMB28.. సర్వం సిద్ధమేనా..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో #SSMB28 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'అతడు' 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీపై అందరిలో మంచి అంచనాలున్నాయి.

ఏడాది క్రితమే అధికారికంగా ప్రకటించబడిన మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. 2022 ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడింది. అయితే నాలుగు నెలలు గడిచిపోయినా ఇంకా సెట్స్ మీదకు రాలేదు. దీనికి కారణం త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ కు సూపర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే అనే టాక్ వచ్చింది.

'సర్కారు వారి పాట' సినిమా సక్సెస్ తర్వాత ఎప్పటిలాగే మహేష్ తన ఫ్యామిలీతో విదేశాలకు హాలిడే కోసం వెళ్లారు. ఫైనల్ నేరేషన్ ఇవ్వడానికి త్రివిక్రమ్ సైతం న్యూయార్క్ కు వెళ్లినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే మహేష్ బాబు 45 రోజుల సెలవులు ముగించుకొని ఇటీవలే హైదరాబాద్ కు తిరిగొచ్చారు. అలానే దర్శక నిర్మాతలతో పలు దఫాలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్‌ తో సంతృప్తి చెంది, పచ్చజెండా ఊపినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే #SSMB28 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీని కోసం హైదరాబాద్ లో భారీ సెట్లు నిర్మిస్తున్నారు. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

'అల వైకుంఠపురములో' తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. మహేష్ కోసం దర్శకుడు ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ మరియు ఫ్యామిలీ డ్రామాని రెడీ చేయనున్నట్లు టాక్. 12 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కావడంతో అందుకు తగ్గట్టుగానే అన్నీ సెట్ చేస్తున్నారు.

ఇందులో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందించనున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు.