Begin typing your search above and press return to search.

రొమాంటిక్ మోడ్ లోకి మేజ‌ర్

By:  Tupaki Desk   |   16 May 2022 1:30 PM GMT
రొమాంటిక్ మోడ్ లోకి మేజ‌ర్
X
వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కే చిత్రాల‌పై ప్రేక్ష‌కులు ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారు. ప్ర‌త్యేకంగా ఆద‌రిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన చిత్రాలు కొంత వ‌ర‌కు యాదార్ధ సంఘట‌న‌ల ఆధారంగా ఫిక్ష‌న‌ల్ క‌థ‌లుగా తెర‌కెక్కిన‌వే. ఇదే పంథాలో వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా మ‌రో చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అదే `మేజ‌ర్‌`. యంగ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ అండ్ రైట‌ర్ అడివి శేష్ ఇందులో హీరోగా న‌టించారు. `గూఢ‌చారి` ఫేమ్ శ‌శి కిర‌ణ్ తిక్క తెర‌కెక్కించారు.

సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ ప్రొడ‌క్ష‌న్స్, జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ ల‌ పై సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శ‌ర‌త్ చంద్ర సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. 2008లో జ‌రిగిన ముంబై ఎటాక్ లో రియ‌ల్ హీరోగా ముష్క‌రుల‌కు ధీటుగా పోరాడి అమ‌రుడిగా నిలిచిన సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ క‌థ‌ని హీరో అడివి శేష్ అందించ‌డం విశేషం. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో షూటింగ్ జ‌రుపుకున్న ఈ మూవీని తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

గ‌త కొన్ని నెలులుగా వ‌రుస‌గా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు జూన్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా మూడు భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాలోని కీల‌క పాత్ర‌ల్లో ప్ర‌కాష్ రాజ్‌, రేవ‌తి, ముర‌ళీశ‌ర్మ‌, శోభితా ధూలిపాళ న‌టించారు. రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని స్పీడ‌ప్ చేశారు.

ట్రైల‌ర్ రిలీజ్ కోసం భారీ ఈవెంట్ ని మ‌హేష్ బాబుతో నిర్వ‌హించిన మేక‌ర్స్ త్వ‌ర‌లో ఈ చిత్రం నుంచి `ఓ ఇషా..` అంటూ సాగే రొమాంటిక్ లిరిక‌ల్ వీడియోని మే 18 బుధ‌వారం సాయంత్రం 4:05 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ చాలా రొమాంటిక్ గా వుంది. అడివి శేష్‌, హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్ ఐస్ క్రీమ్ తింటూ న‌డుచుకుంటూ వ‌స్తున్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది. సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య వున్న కెమిస్ట్రీని ఈ స్టిల్‌ తెలియ‌జేస్తోంది.

ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీకి అండ‌గా నిల‌వాల‌ని ఇటీవ‌ల హీరో అడివి శేష్‌, ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని ప్ర‌త్యేకంగా ఢిల్లీలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌లిశారు. ట్రైల‌ర్ ని కూడా చూపించ‌డంతో ఓ రియ‌ల్ హీరో క‌థ‌ని వెండితెర‌పై ఆవిష్క‌రించినందుకు మంత్రి రాజ్ నాథ్ సింగ్... హీరో అడివి శేష్‌, ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్కని అభినందించారు. జూన్ 3న భారీ స్థాయిలో విడుద‌ల కానున్న ఈ మూవీ తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.